ముంబై: కరోనా మహమ్మారి పీడ విరగడైనట్లే అనుకున్న సందర్భంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రతి రోజూ నమోదవుతున్న కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మాస్క్లు పెట్టుకోకుండా, వ్యాక్సిన్ వల్ల వచ్చిన బాధ్యతారాహిత్యంతో ప్రజలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు శశాంక్ జోషి అన్నారు. మహారాష్ట్రలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని, కొవిడ్ చాలా వేగంగా వ్యాపిస్తోందని ఆయన చెప్పారు. ముంబైలో టెస్టింగ్ కూడా తగ్గిపోయిందని ఆయన తెలిపారు.
రెస్టారెంట్లలో మాస్కులు పెట్టుకోకపోవడం అన్నది మహారాష్ట్రలో ఆందోళన కలిగించే అంశం. ప్రజలు ఇలాగే ఉంటే కరోనాను నియంత్రించడం సాధ్యం కాదు. వ్యాక్సినేషన్ వల్ల ప్రజల్లో బాధ్యతారాహిత్యం పెరిగిపోతోంది. వ్యాక్సినేషన్ తర్వాత కూడా కనీసం రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి. యాంటీబాడీలు సడెన్గా తగ్గిపోయి కరోనా మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉంటుంది. ఈ ఏడాది మొత్తం కచ్చితంగా మాస్కులు ధరించాల్సిందే అని శశాంక్ జోషి స్పష్టం చేశారు. సోమవారం మహారాష్ట్రలో 15 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. లాక్డౌన్లు, రాత్రి కర్ఫ్యూలో కూడా కరోనాను కట్టడి చేయలేకపోతున్నాయి.