నాగర్కర్నూల్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది యాసంగి సీజన్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారు. కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయమని స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించింది. వరి కొనుగోళ్లలో ఎదురయ్యే ఆర్థిక, కష్టనష్టాలను వివరించింది. ఫలితంగా వరి సాగు తగ్గింది. నాగర్కర్నూల్ జిల్లాలో గత సీజన్లో 1,47,829 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్లో 1.10 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేయగా.. కేవలం 30 వేల ఎకరాలకే పరిమితం కావడం గమనార్హం. దాదాపు 80 వేల ఎకరాల మేర వరి సాగు తగ్గింది. ఇక గత సీజన్తో పోలిస్తే ఏకంగా 1.17 లక్షల ఎకరాలు తగ్గింది.
జిల్లాలో ఎంజీకేఎల్ఐతో నీటి వనరులు పెరిగాయి. ఫలితంగా గత నాలుగేండ్లల్లో వానకాలం, యాసంగి సీజన్లలోనూ రైతులు వరికే మొగ్గు చూపేవారు. కానీ, మారిన కేంద్ర విధానంతో రైతులు వరి సాగును గణనీయంగా తగ్గించారు. బిజినేపల్లిలో అత్యధికంగా 7,186 ఎకరాల్లో, అత్యల్పంగా అమ్రాబాద్లో 11 ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లాలో అత్యధికంగా 1,38,830 ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, అత్యధింగా అచ్చంపేట మండలంలో 16,467, అత్యల్పంగా పెంట్లవెల్లిలో 333 ఎకరాల్లో సాగు చేశారు.
జిల్లాలో పంటల వారీగా చూస్తే.. చారకొండలో సజ్జలు 30 ఎకరాలు, బిజినేపల్లిలో ఎకరం, వంగూరులో 0.23 ఎకరాల్లో సాగైంది. అలాగే జొన్నలు 909, కొర్రలు 437, మొక్కజొన్న 7,433, రాగులు 16, గోధుమలు 12, ఆముదం 920, సన్ఫ్లవర్ 153, శనగలు 278, కందులు 18,838 ఎకరాల్లో సాగైంది. ఈ సీజన్లో జిల్లాలో 1,99,076 ఎకరాల్లో ఆయా రకాల పంటలు సాగయ్యాయి. ఇదిలా ఉండగా, గత సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యాన్నే కేంద్రం తీసుకోలేదు. జడ్చర్ల గోదాంలోనే ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. మొత్తమ్మీద వరి సాగు తగ్గడంతో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు రైతుల తీరుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అవగాహన కల్పించడంతో..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు వరి పంట సాగుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాం. దీంతో ఈ సీజన్లో గత యాసంగి కంటే సాగు గణనీయంగా తగ్గింది. గత సీజన్లో జిల్లాలో మొత్తం 3.06 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేయగా.. 1.47 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్లో 1.90 లక్షల ఎకరాల్లో పలు పంటలు సాగు కాగా.. అందులో 30 వేల ఎకరాలకే వరి పరిమితమైంది. మారిన పరిస్థితులను అర్థం చేసుకొని రైతులు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించడం సంతోషకరం.
– వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్కర్నూల్