టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమ పార్టీ ఎన్నో ఆటు పోట్లను తట్టుకున్నది. కెరటంలా పడినా లేచి తన ఉనికిని
కాపాడుకుంటూ వస్తున్నది. ఉద్యమ నేత కేసీఆర్ ధైర్యంతో తీసుకున్ననిర్ణయాలే ప్రాణం పోశాయి. 2001 జూన్ 1న మహబూబ్నగర్లోజరిగిన భారీ బహిరంగ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.ఉమ్మడి జిల్లాలో తెలంగాణ వాదం లేదన్న సమైక్యవాదుల నోటికి తాళంవేశారు. 2009లో పాలమూరు నుంచి ఎంపీగా ఉద్యమ నేత కేసీఆర్ ప్రాతినిథ్యం వహించారు. పాలమూరు కరువు తీర్చి.. బంగారు తెలంగాణవైపు అడుగులు పడేలా చేశారు. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించేలా కృషి చేస్తున్నారు. అలా 20 ఏండ్ల ప్రస్థానంలో గులాబీ పార్టీని ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. నేడు మరోసారి పార్టీఅధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా కథనం.
మహబూబ్నగర్ అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ 20 ఏండ్ల ప్రస్థానం పడిలేచిన కెరటాన్ని తలపిస్తుంది. కెరటం లాగే గులాబీ పార్టీ పడిపోయిన ప్రతీసారి లేచి తన ఉనికిని కాపాడుకున్నది. ప్రత్యేక రాష్ట్రమే ఏకైక ఎజెండాగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ప్రయాణంలో వైఫల్యాలు, విజయాలు దోబూచులాడాయి. పడిన ప్రతిసారి ఉద్యమ నేత కేసీఆర్ ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలే ప్రాణం పోశాయి. తెలంగాణ నినాదం, భావన వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థీకృతంగా మార్చడంలో, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వ్యాపింప చేయడంలోటీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ వాదాన్ని విస్తరించే క్రమంలో కేసీఆర్ రాజకీయ మార్గంలో ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా ఆయనతో పాటు కలిసి నడిచింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సమీపంలోని జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్ 27న కొంతమంది తెలంగాణ వాదుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేసినప్పుడు పాలమూరు నుంచి వేళ్లపై లెక్క పెట్టే స్థాయిలో ఉద్యమకారులు హాజరయ్యారు. ఇప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. కార్యకర్తలు వెంట రాకపోయినా గ్రామ గ్రామానికి తిరిగి తెలంగాణ వాదాన్ని జనానికి వినిపించారు. 2001 జూన్ 1న మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఉద్యమ నేత కేసీఆర్ వినిపించారు. చెంతనే కృష్ణా తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా… సాగు తాగు నీళ్లు లేని దుస్థితిని ప్రజలకు గుర్తు చేశారు. 2003 జూలైలో ఆర్డీఎస్ రైతుల ఆవేదనను ప్రపంచానికి తెలిపేందుకు అలంపూర్ నుంచి గద్వాలకు ఎనిమిది రోజులు పాదయాత్ర నిర్వహించారు. దారిపొడవునా టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందో, స్వరాష్ట్రం సాధించుకుంటే మనకు ఏం లాభం జరుగుతుందో ఉద్యమ నేత ప్రజలకు వివరిస్తూ వచ్చారు. 2008లో పాలమూరు ప్రజాగర్జన ద్వారా స్వరాష్ట్రం సాధించడమే ఏకైక ఎజెండా అని పాలమూరు ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ 2009లో చేపట్టిన దీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విశేషమైన మద్దతు లభించింది. దీక్షా దివస్ నాడు వేలాది మంది విద్యార్థులు రహదారుల పైకి వచ్చారు. కేసీఆర్ ఆరోగ్యం విషమించిందని తెలిసి అనేకమంది ఆవేదన చెందారు. 2010లో పాలమూరుకు చెందిన విద్యార్థులు కావలి సువర్ణ, దాసరి నరేశ్ తెలంగాణ కోసం ఆత్మార్పణం చేయడం ఉమ్మడి పాలమూరు జిల్లాను కదిలించింది. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని తెలంగాణ వాదాన్ని జనం పెద్ద ఎత్తున స్వాగతించారు. 2011లో నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ నుంచి కొల్లాపూర్ వరకు సుమారు 200 కిలోమీటర్ల దూరం తెలంగాణ సాధన పాదయాత్ర నిర్వహించారు. 2012లో సడక్ బంద్ చేపట్టిన టీఆర్ఎస్ ముఖ్య నేతలను అరెస్టు చేసి మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించినప్పుడు… ఉద్యమ నేత కేసీఆర్ పాలమూరు జిల్లా జైలుకు చేరుకుని అరెస్టయిన నేతలకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఏర్పాటు త్వరలోనే సాధ్యమవుతుందని ఆరోజే ప్రకటించారు. ఎట్టకేలకు 2013లో యూపీఏ 2 ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2014 మే నెలలో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి దిగి ఘన విజయం సాధించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఎన్నికలకు వెళితే, తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లింది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారు. 2014 జూన్ 2న కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సాగించింది. 2019లోనూ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన చాలా పార్టీలు చరిత్రలో కలిసిపోయాయి. కానీ, టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీగా చరిత్రకెక్కడమే కాకుండా రెండో విడుత మరింత భారీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా పాలమూరులో తెలంగాణవాదం లేదని పేర్కొంటూ వచ్చిన వారందరికీ చెంపపెట్టు సమాధానం చెబుతూ… 2009లో జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల్లో అప్పటి ఉద్యమనేత కేసీఆర్ ఘన విజయం సాధించేందుకు పాలమూరు ప్రజలంతా కారణమయ్యారు. కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ ఉద్యమం లేదని సమైక్యవాదులు ప్రచారం చేసుకుంటారనే భయంతో జనం మరింత కసిగా ఓట్లేసి కేసీఆర్ను గెలిపించే బాధ్యతను తమ భుజస్కంధాలపై మోశారు. అలా కేసీఆర్ మన మహబూబ్ నగర్ ఎంపీగా తెలంగాణ సాధించినందుకు… ఈ ప్రాంతం ఎప్పటికీ గర్వంతో ఉప్పొంగి పోతోంది. ఉద్యమ నేతగా, పాలమూరు ఎంపీగా తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ ఉద్యమ పార్టీకి మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోయే సందర్భం పాలమూరు వాసులకు ఎంతో ముఖ్యమైనదిగా నిలుస్తోంది. ఉద్యమ నేతగా రాష్ట్రం సాధించడమే కాకుండా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే సుమారు 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేలా చేయడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టి సాధ్యమైనంత త్వరలో ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే యజ్ఞం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చారు. సమైక్య రాష్ట్రంలో ఉపాధి లేక వలసలు వెళ్లిన వారంతా తిరిగి వచ్చేలా చేశారు. పాలమూరుపై ప్రత్యేకాభిమానం చూపించే కేసీఆర్ ఉద్యమ పార్టీకి మరోసారి అధ్యక్షునిగా ఎంపికవ్వడం ఈ ప్రాంత వాసులకు ప్రత్యేకమైన ఘట్టంగా ఉండబోతోంది.