ఆర్డీఎస్ ప్రక్షాళన కోసం కేసీఆర్ పాదయాత్ర
తుమ్మిళ్ల లిఫ్ట్కు అంకురార్పణ అప్పుడే..
రూ.763 కోట్లతో తుమ్మిళ్ల లిఫ్ట్, మూడు రిజర్వాయర్లు మంజూరు
వడ్డేపల్లి, అక్టోబర్ 24: ‘అన్ని ఉండి అల్లుడినోట్లో శని’ అనే మాదిరి ఆర్డీఎస్ కాలువ, సుంకేసుల బ్యారేజీ ఉన్నప్పటికీ నీటిని కేసీ కెనాల్ ద్వారా దౌర్జన్యంగా తరలించుకొనిపోతూ అలంపూర్ నియోజకవర్గ రైతుల పొలాలు బీడుగా మార్చిన రోజులవి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్ పరిరక్షణ కమిటీ వారితో, రైతులతో కలసి అలంపూర్ నుంచి రాజోళిబండకు పాదయాత్ర చేపట్టారు. ఇక్కడ జరుగుతున్న నీటి దోపిడీని, రైతుల కష్టాలను తెలుసుకున్నారు. 2021 సంవత్సరం అక్టోబర్ 10న రాత్రి శాంతినగర్లోని అంబేద్కర్ చౌరస్తాలో మీటింగ్ నిర్వహించారు. రైతుల పక్షాన మాజీ జెడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్డీఎస్ సమస్య తీరాలంటే లిఫ్ట్ అవసరమని, ఆర్డీఎస్ ప్రక్షాళన జరగాలని, ఆంధ్రా ప్రాంత నాయకుల దౌర్జన్యాన్ని అరికట్టాలని, రైతులకు సాగునీరు అందేలా చూడాలని కేసీఆర్కు వివరించారు. కేసీఆర్ అదే సమావేశంలో నియోజకవర్గ రైతులకు మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం సుమారు రూ.763 కోట్లతో తుమిళ్ల లిఫ్ట్, మూడు రిజర్వాయర్లు మంజూరు చేయడమే కాకుండా తుమ్మిల్ల లిఫ్ట్ను పూర్తి చేసి రైతుల్లో ధైర్యం నింపారు. ఆనాడు పాదయాత్రలో చేసిన హామీ నిలబెట్టుకున్నారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తలరాత మార్చిన
తండాలను పంచాయతీలుగా మార్చి మా తలరాతను ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చిండు, మంత్రి నిరంజన్రెడ్డి చొరవతో ఇక్కడ సాగునీరు వచ్చి ఇక్కడి భూములు సస్యశ్యామలం అయ్యింది. 24 తండాల్లో ఎనిమిదింటిని పంచాయతీలుగా మార్చారు. మా సొంత తండా కర్నెతండా అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. నాలుగు దిక్కులా రోడ్లు అభివృద్ధి చేశారు. అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చాం. రూ.72 కోట్లతో మరో లిఫ్టు మంజూరు చేయించారు.
వలస పోయెటోన్ని..
ఒకప్పుడు ఇక్కడ జీవనాధారం లేక ముంబాయికి వలస వెళ్లేవాడిని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరూ వలస వెళ్లడం లేదు. వలస కార్మికుల కోసం ఒకప్పుడు ముంబాయికి బస్సు నడిచేది. తెలంగాణ వచ్చి సాగునీరు వచ్చాక మా పరిస్థితి మారింది. బీడు భూములు పంట భూములుగా మారాయి. తండాలను పంచాయతీలుగా మార్చడం వల్ల సర్పంచ్గా ఎంపికయ్యా.