‘టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహిద్దాం.. ఇందులో భాగంగా 25న ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్లో నిర్వహించే తెలంగాణ విజయ గర్జన సభను వియవంతం చేయాలి’.. అని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 9 నియోజకవర్గ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విజయ గర్జన సభతో వరంగల్ జనసంద్రాన్ని తలపించాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి ఓ బస్సు ఇక్కడకు రావాలని, ఇందుకోసం ఆయా గ్రామ కమిటీలు ప్రత్యేక బాధ్యత వహించాలన్నారు.
మహబూబ్నగర్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోవాలని.. ఇందుకుగానూ ప్రతి గ్రామం నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చీమలదండులా కదలాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మం త్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 25న జరగనున్న ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్లో నిర్వహించనున్న ద్విదశాబ్ది విజయ గర్జన సభ నేపథ్యం లో మంత్రి కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్లో పాలమూరు జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఒకే రోజు 9 నియోజకవర్గాలకు చెందిన మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. మొదట మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, కల్వకుర్తి నియోజకవర్గాలతో, తర్వాత కొడంగల్, నాగర్కర్నూల్, నారాయణపే ట, షాద్నగర్ నియోజకవర్గాల నాయకులతో మా ట్లాడారు. ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి, రవా ణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, పార్టీ జనరల్ సెక్రటరీ కే.కేశవరావు, ఎంపీలు పోతుగంటి రాము లు, మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు డా.సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, జైపాల్యాదవ్, మర్రి జనార్దన్రెడ్డి, నరేందర్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, కె.దామోదర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, కార్పొరేషన్ చైర్మన్లు దేవర మల్లప్ప, బాద్మి శివకుమార్, మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్, నాయకులు వాల్యానాయక్, ఇంతియాజ్ తదితరులు హాజరయ్యారు.
ప్రతి గ్రామం నుంచి ఓ బస్సు..
పార్టీ ప్రారంభించిన తర్వాత ఉద్యమ నేత కేసీఆర్ ఎంతో కష్టపడి పార్టీని ఎలా ఉన్నత స్థాయికి తీసుకువచ్చారో దేశమంతా గమనిస్తున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉద్యమ సమయంలో ఎన్నో కష్టాలు పడి.. ప్రస్తుతం అధికారంలోకి వచ్చే వరకు ముఖ్యమంత్రి చేసిన పోరాటాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రారంభించి 20 ఏండ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 15న వరంగల్లో జరిగే ద్విదశాబ్ది విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు బయలుదేరాలని సూచించారు. పార్టీ నేతలంతా గ్రామ కమిటీలకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆదివారం అన్ని మండల కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కమిటీ బాధ్యులు సమావేశంలో వరంగల్ సభపై చర్చించాలని.. ఈ మేరకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వారికి దిశానిర్దేశం చేయాలని సూచించినట్లు తెలిసింది. ముందస్తుగానే గ్రామ కమిటీలు బస్సులు బుక్ చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ నెల 25న పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించే ప్లీనరీ సమావేశం సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు సమావేశం ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్లీనరీ ముగిసిన తర్వాత ఈ నెల 27న ప్రతి నియోజకవర్గంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.ఉద్యమ పార్టీగా ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే అం శంపై కేటీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ప్రజల మధ్య ఉండే వారికి గెలుపు అనేది సాధారణ విషయం అని గుర్తుంచుకోవాలని కేటీఆర్ తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముక లాంటి వారని, కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలని పిలుపునిచ్చా రు. సీఎం రిలీఫ్ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, రైతుబీమా ప్రొసీడింగ్స్ మొదలైనవి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి అందించేలా చూడాలని కేటీఆర్ సూచించినట్లు పార్టీ నేతలు తెలిపారు.
ప్రజల మధ్యే ఉండాలన్నారు..
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుమారు గంట సేపు అన్ని అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మిగతా నేతలందరి బాధ్యత గురించి వివరించారు. వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన చెక్కులు, ప్రొసీడింగ్స్ మొదలైన వాటిని నేరుగా వారి ఇంటికే వెళ్లి ఇవ్వాలని చెప్పడం అందరినీ ఆలోచింపజేసింది. ప్రజల మధ్యే ఉండాలని, వారితో మమేకం అవ్వాలని సూచించారు. ఈ అంశం నూటికి నూరుపాళ్లు ఆచరించతగినది. ఏ కార్యక్రమాలకైనా స్థానిక పార్టీ బాధ్యులు, కార్యకర్తలతో కలిసి వెళ్లడం అనే సూచన కూడా పార్టీ పటిష్టతకు పనికివస్తుంది. నియోజకవర్గానికి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే సమాచారం ఎమ్మెల్యే వద్ద, మండలానికి ప్రభుత్వం ఇచ్చిన నిధులెంతో చెప్పే సమాచారం ఎంపీపీ వద్ద, గ్రామాభివృద్ధికి సర్కార్ ఎంత నిధులు వెచ్చించిందో చెప్పే వివరాలు సర్పంచ్ వద్ద ఉండాలని కేటీఆర్ చెప్పిన అంశం అందరూ పాటించాలి. ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, చేస్తున్నదో చెప్పేలా ప్రతి ప్రజాప్రతినిధి, కార్యకర్త సిద్ధంగా ఉండాలి. ఎన్నికలప్పుడు చేయాల్సిన పనులను అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేస్తే ప్రజలు కళ్లల్లో పెట్టి చూసుకుంటారని సూచించారు. ప్రతిపక్షాలకు వీసమెత్తు అవకాశం కూడా లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ మా బాధ్యతలను నిర్వర్తించేలా సూచనలిచ్చారు.