మహబూబ్నగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇనుప కండరాలు, ఉక్కు నరాలు , వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరమన్న స్వామి వివేకానంద సూక్తిని ఆచరించే యువత క్రమేపీ తగ్గిపోతున్నారు. భవిష్యత్ మీద బెంగతో నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే వారు, ఎలక్ట్రానిక్ గాడ్జట్స్తో దోస్తీ చేస్తున్న వారే అధికంగా కనిపిస్తున్నారు. పోటీ ప్రపంచంలో పడి తమ ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోనే వారే కరువయ్యారు. ఈ పరిస్థితు ల్లో రోజురోజుకూ దేశంలోని యువత బలహీనంగా మారుతుండడాన్ని ఓ వృద్ధుడిని కలచివేసింది. ఉరుకులు, పరుగుల జీవితంలో కనీసం తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టని వారెందరికీ ఓ నినాదం అందించాలని భావించారాయన. అందుకే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఫిట్ ఇండియా పేరిట సైకిల్ యాత్ర చేపట్టారు. ఎండనక, వాననక అనే సమస్యలను ఎదుర్కొంటూ కన్యాకుమారి దిశగా సాగుతున్నారు. దా రిపొడవునా అందరికీ ఆయన చెప్పే మంత్రం ఒక్కటే ఫిట్ ఇండియా. అందరూ ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలి, అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యమవుతుందని చెప్పారు. దేశ హిత కోసం సైకిల్ యాత్ర చేస్తున్న ఆ వృద్ధుడి పేరు సంజయ్ మయూరే. వయస్సు 67 ఏండ్లు, మహారాష్ట్రలోని బుల్దానా ఆయన స్వస్థలం. నాయబ్ తాసిల్దార్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆయన అందరిలా కృష్ణారామా అంటూ మనవళ్లతో కాలక్షేపం చేయలేదు. దేశంలో యువత రోజురోజుకూ శారీరకంగా బలహీనంగా మారుతున్నారని ఆవేదనకు గురయ్యారు. అందుకే దాదాపు 7 పదుల వయస్సులో ఆయన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టాలని భావించారు. కేవలం రెండు జతల దుస్తులు, సైకిల్ రిపేర్ సామాగ్రి మాత్రమే వెంట ఉంచుకొని గత నెల 8వ తేదీన శ్రీనగర్లోని రామకృష్ణ మఠం నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించారు. దారి పొడవునా యువతతో మాట్లాడుతూ తన సైకి ల్ యాత్ర ఉద్దేశాన్ని వారికి వివరిస్తూ ముందుకు సాగారు. రోజు కు 110 నుంచి 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఆయన పర్యటన చేస్తున్నారు. బుధవారం మహబూబ్నగర్కు ఆయన వచ్చా రు. తెలంగాణ దాటి ఏపీకి చేరుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. బైకులు, కార్లు తగ్గించి సైకిళ్లు వాడాలని, దీంతో శారీరక దృఢత్వంతోపాటు కాలుష్యం కూడా తగ్గుతుందని సందేశం ఇస్తున్నారు. శ్రీ నగర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారి వెంట సుమారు 3550 కి.మీ. యాత్ర కొనసాగనున్నది. కానీ ఆయన దారి పొడవునా ఉన్న వివిధ పట్టణాలకు చేరుకొని అక్కడ వారితో మాట్లాడుతుండడంతో 4 వేలకుపైగా ప్రయాణించాల్సి వస్తుందన్నారు. 26లోగా కన్యాకుమారి చేరుకుంటానని చెప్పారాయన.