మహబూబ్నగర్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి శ్రీనివాసుడి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీన స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా.. మంగళవారం అలంకరణోత్సవం నిర్వహించనున్నారు. కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి కొండలను పోలినట్లు కురుమూర్తి కొండలైన శేషాద్రి, ఏకాద్రి, దుర్గాద్రి, ఘానాద్రి, బళ్లు కాద్రి, పతాద్రి, దైవతాద్రి, దేవుని గుట్ట ఇలా ఏడు కొండల మధ్య దేవుని గుట్టలో కొలువుదీరిన కురుమూర్తి స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.
కార్మీక మాసమంతా బ్రహ్మోత్సవాలు..
స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర కార్తీక మాస శుద్ధ పాఢ్యమి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతాయి. రోజుకో వాహన సేవలు నిర్వహిస్తూ కార్తీక మాసమంతా జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రధానంగా 9న స్వామివారి అలంకరణోత్సవం కార్యక్రమానికి లక్షలాదిగా భక్తులు హాజరవుతారు. ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి ఉద్దాల ఉత్సవాలకు ఇసుకేస్తే రాలనంతగా భక్తులు హాజరవుతారు. ఈ నెల 11న జరిగే ఉద్దాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించారు. గతంలో ఎన్నడూ నిర్వహించని స్థాయిలో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
నాన్ వెజ్ స్పెషల్..
కురుమూర్తి జాతర అంటేనే కాల్చిన సీకులు గుర్తుకొస్తాయి. స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యే భక్తులు గుట్ట దిగువన ఏర్పాటు చేసే స్టాల్స్లో ప్రత్యేకంగా తయారు చేసే పాలమూరు కబాబ్స్ కోసం ఎగబడతారు. ఇక్కడ వివిధ రకాల మసాలా దినుసులతో తయారుచేసే కాల్చిన మాంసం విక్రయాలకు రాష్ట్రంలోనే కురుమూర్తికి ప్రత్యేకత ఉంది. గత ఏడాది కొవిడ్ కారణంగా ఎలాంటి వ్యాపారాలు లేకుండా, మద్యం, మాంసం, వినోద కార్యక్రమాలకు చోటు లేకుండా కేవలం స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో జాతరకు వచ్చిన వారంతా పెదవి విరిచారు. కురుమూర్తిలో సీకులు ఆరగించేందుకు అనేక మంది నాన్ వెజ్ ప్రియులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. వావ్ కబాబ్స్ అంటూ లొట్టలేసుకుంటూ ఆస్వాదిస్తారు. కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే ఈ ప్రాంతం బ్రహ్మోత్సవాలు నిర్వహించే రోజుల్లో సందడిగా ఉంటుంది.
అలంకరణకు ఏర్పాట్లు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి మంగళవారం అలంకరణ ఉత్సవం నిర్వహించనున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ ఎస్బీఐలో భద్రపరిచిన ముక్కెర వంశీయులు బహూకరించిన కోట్ల విలువ చేసే స్వామివారి బంగారు ఆభరణాలకు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించి.. బ్యాంకు నుంచి భారీ బందోబస్తుతో ఊరేగింపుగా తీసుకెళ్లి కాంచన గుహలో కొలువైన కురుమూర్తి స్వామి వారికి అలంకరిస్తారు. ఈ ఉత్సవంలో ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొంటారు. గతేడాది కొవిడ్ నిబంధనల కారణంగా భక్తులు తక్కువగా హాజరయ్యారు. ఈ ఏడాది భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నది. కొవిడ్ భయం లేకున్నా.. భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
కనీవిని ఎరుగని రీతిలో..
గతేడాది కొవిడ్ కారణంగా ఉత్సవాలను సాధారణంగా నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఏడాది కొవిడ్ ఇబ్బందు లు లేనందున కనీవిని ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేలా ఏర్పా ట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి లో పాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటు న్నాం. ప్రతి ఒక్కరూ దేవుడికి సేవ చేస్తున్నామన్న భావనతో పనిచేయాలి. ఉ ద్దాల ఉత్సవానికి ఇసుకేస్తే రాలనంతగా జనం హాజరుకానున్నందున జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 2019లో ఉద్దాల ఉత్సవాలకు రెండు లక్షల మందికి పైగా భక్తులు రాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పర్యవేక్షక, పారిశుధ్య, ఆహార, ఫైనాన్స్, శానిటేషన్ కమిటీలు ఏర్పాటు చేశాం. అన్ని కమిటీలను పర్యవేక్షిస్తూ అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీ పర్యవేక్షణ ఉంటుంది. చిన్నచింతకుంట మండల కేంద్రం నుంచి కురుమూర్తికి కొత్తగా రోడ్డు నిర్మాణం కోసం రూ.30 కోట్లు, కురుమూర్తి రోడ్డు నుంచి గుట్టపైకి రూ.11 కోట్లతో రహదారి మంజూరు చేయించాం. టెండర్లు కూడా పూర్తై త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
ఆలయ అభివృద్ధి కోసం మా వంతుగా అన్ని ఏర్పాట్లు చేపడతాం.