గద్వాల, నవంబర్ 6 : రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఏరియా దవాఖానలను జిల్లా ఆసుపత్రులుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ది. ఇందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జోగుళాంబ గద్వాలతోపాటు నారాయణపేట దవాఖానలు ఉండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఏరియా దవాఖానలో ప్రస్తుతం వంద పడకలు ఉన్నాయి. ప్ర భుత్వ నిర్ణయంతో 300 పడకల స్థాయిగా మా ర్చనున్నారు. అంతేకాకుండా 14 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో రోగులకు ఇంకా మెరుగైన వైద్యం అందనున్నది. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం చేయించుకోవాలంటే భయపడేవారు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. జిల్లా దవాఖానలో ప్రైవేట్ దవాఖానలకు దీటుగా వైద్య సేవలు అందుతుండడంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న 100 పడకల దవాఖాన స్థాయిని 300 పడకలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోపాటు వైద్య పరికరాలు, మౌలిక వసతుల కల్పనకు రూ.49.16 కోట్లు విడుదల చేసింది. నిత్యం సుమారు 500 నుంచి 600 మంది వరకు ఓపీ సేవలు వినియోగించుకుంటున్నారు. స్థాయి పెంపుతో ఓపీ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతోపాటు స్టాఫ్ నర్సులు, వైద్యులు, వార్డు బాయ్లు, పరిపాలన సిబ్బంది, పేషెంట్ కేర్ టేకర్లు, శానిటేషన్, సెక్యూరిటీ తదితర ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంటుంది.
తీరనున్న రోగుల కష్టాలు..
స్థాయితోపాటు వైద్య సేవలు కూడా మెరుగుపడనుండడంతో రోగుల కష్టాలు తీరనున్నాయి. గతంలో ఏ చిన్న ప్రమాదం జరిగినా.. కర్నూల్ లేదా హైదరాబాద్కు రెఫర్ చేసేవారు. అయితే, జిల్లాలు ఏర్పాటైన తర్వాత దవాఖానల్లో విడుతల వారీగా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నది. జిల్లా కేంద్రంలోని దవాఖానలో 20 పడకలతో ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేసి అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు. పిల్లల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. డయాలిసిస్ కేంద్రం ద్వారా ఎంతో మంది వైద్య సేవలు పొందుతున్నారు. వివిధ రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేసేందుకు డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత జిల్లా దవాఖానలో ఆక్సిజన్ బెడ్లు పెంచడంతోపాటు ఆక్సిజన్ను అక్కడే ఉత్పత్తి చేస్తున్నారు. దవాఖాన ఆవరణలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లను రూ.1.3 కోట్లతో ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 350 బెడ్లకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా అవుతున్నది. ఇందుకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం వంద పడకలకు నిరంతరాయంగా ఆక్సిజన్ అందించే ప్లాంట్ ప్రారంభమైనది. మరొకటి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు జిల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాలను త్వరలో ప్రారంభించనున్నారు. దవాఖాన స్థాయి పెంపు, నర్సింగ్ కళాశాల మంజూరు కావడంతో భవిష్యత్తో జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమం కానున్నది.
ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం..
ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న దవాఖాన స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. స్థాయి పెంపుతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉన్నది. ఇప్పటికే దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరైంది. ఇలా విడుతల వారీగా ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వసతులు కల్పిస్తున్నది. భవిష్యత్లో జిల్లా వైద్య హబ్గా మారే అవకాశం ఉన్నది.