పాలమూరు పర్యాటకంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురికాగా.. ప్రత్యేక రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక దృష్టి సారించడంతో టూరిజంలో కొత్తదనం సంతరించుకుంటున్నది. నల్లమలలో రూ.100 కోట్లతో చేపట్టిన ఎకో టూరిజం కొత్త పుంతలు తొక్కుతుండగా.. జూరాల ప్రాజెక్టు వద్ద అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలను సందర్శించేలా ప్రత్యేక టూరిజం సర్క్యూట్ను అధికారులు ప్రారంభించారు. రూ.300కే ఏసీ బస్సులో మన్యంకొండ, పిల్లలమర్రి, కేసీఆర్ అర్బన్ ఎకో పార్కును సందర్శించే అవకాశం కల్పించారు.
మహబూబ్నగర్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమైక్య పాలనలో పాలమూరు అంటే కరువు కాటకాలకు, వలసకు మారుపేరుగా ఉండేది. ఎన్నో గొప్ప గొప్ప చారిత్రక ప్రదేశాలున్నా మరుగున పడ్డాయి. పర్యాటకం అంటే కేవలం సీమాంధ్రకే పరిమితం అనేలా పరిస్థితిని మార్చేశారు. పూట గడిస్తే చాలన్నట్లుగా పరిస్థితి ఉన్న తరుణంలో ‘మాకు పర్యాటకం కావాలి.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండి’ అని అడిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగు, తాగు నీరు వచ్చింది. స్థానికంగా వ్యవసాయం ఊపందుకున్నది. వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చేశారు. వ్యవసాయం మెరుగుపడడంతో ఒక్కో రంగం క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. నిర్లక్ష్యానికి గురైన పర్యాటక రంగానికి మంచి రోజులు వచ్చాయి. నల్లమలలో రూ.100 కోట్లతో చేపట్టిన ఎకో టూరిజం కొత్త పుంతలు తొక్కుతున్నది. జూరాల ప్రాజెక్టు వద్ద పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ అర్బన్ ఎకో పార్కును చూసేందుకు వివిధ రాష్ర్టాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఆసియాలోనే రెండో అతి పెద్దదైన మర్రి చెట్టు (పిల్లలమర్రి)ను సందర్శించేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. పాలమూరు తిరుపతిగా ఖ్యాతికెక్కిన మన్యంకొండకు భక్తులు భారీగా వస్తున్నారు. వీటన్నింటి వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా పర్యాటక సర్క్యూట్లను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రంలో తొలి విడుతగా మహబూబ్నగర్ పర్యాటకం పేరున ప్రత్యేక టూరిజం సర్క్యూట్ను ప్రారంభించారు.
రూ.300కే ఏసీ బస్సులో పర్యాటకం..
కేవలం రూ.300కే ఏసీ బస్సులో మన్యంకొండ, పిల్లలమర్రి, కేసీఆర్ అర్బన్ ఎకో పార్కును సందర్శించేందుకు పర్యాటక శాఖ అవకాశం కల్పించింది. ఉదయం 10 గంటలకు మహబూబ్నగర్ కలెక్టరేట్ నుంచి ప్రారంభమయ్యే ఏసీ బస్సు మొదట మన్యంకొండకు చేరుకుంటుంది. అక్కడ వీఐపీ దర్శనం అనంతరం స్వామి వారి ప్రసాదం అందజేస్తారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ను చూపిస్తారు. ఆ తర్వాత కొండ దిగువన పద్మావతీ అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా పిల్లలమర్రికి తీసుకెళ్తారు. అక్కడ మినీ జంతు ప్రదర్శన శాల, పురావస్తు ప్రదర్శన శాల, సైన్స్ మ్యూజియం, చిల్డ్రన్స్ పార్కు, ఆక్వేరియం మొదలైనవి వీక్షించొచ్చు. చివరగా దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ అర్బన్ ఎకో పార్కుకు తీసుకెళ్తారు. 2,087 ఎకరాల్లో ఉన్న ఈ పార్కును ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ రావాలనిపించేలా అడ్వెంచర్స్ ఆకట్టుకుంటున్నాయి. బటర్ ఫ్లై గార్డెన్, బోటింగ్, వాటర్ ఫాల్స్, రాశీ వనం, నవగ్రహ వనం, హెర్బల్ గార్డెన్, మకావ్ ఎన్ క్లోజర్స్, బాంబూ హట్, అడ్వెంచర్ పార్క్, రెయిన్ ఫారెస్ట్, కరెన్సీ పార్కు, నక్షత్ర వనం, బ్యాంబూ కెనోపీ వాక్, ఆర్చరీ, హంసల కొలను మొదలైనవి వావ్ అనిపించక మానదు. ఈ సర్క్యూట్లోని మూడు ప్రదేశాల్లోనూ అన్ని చోట్లా ఎంట్రీ ఉచితం. కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో అడ్వెంచర్ ఈవెంట్స్లో పాల్గొనేందుకు మాత్రం అక్కడ నిర్ణయించిన టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ పర్యటనకు వెళ్లిన పర్యాటకులు అద్భుతంగా ఉందని అంటున్నారు.
రెండో దశలో ఉమ్మడి జిల్లా సర్క్యూట్..
తొలి దశలో మహబూబ్నగర్ పర్యాటక సర్క్యూట్ ప్రారంభించగా.. రెండో దశలో ఉమ్మడి జిల్లా పర్యాటక సర్క్యూట్ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్ అ ర్బన్ ఎకో పార్కు, పిల్లలమర్రి, మన్యంకొండతోపాటు సోమశిల, జటప్రోల్, శ్రీరంగాపూర్, బీచుపల్లి, జూరాల, అలంపూర్ కలుపుతూ మరో సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ట్రిప్ ఏర్పాటు చేయాలనే ఆలోచన లో అధికారులు ఉన్నారు. అయితే, తొలి దశ పర్యాటక సర్క్యూట్ విజయవంతం అయితే వెంటనే రెండో దశకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచా రం. ఇప్పటికే హైదరాబాద్ నుంచి సోమశిలకు.. అ క్కడి నుంచి లాంచీలో శ్రీశైలం వెళ్లే టూర్ విజయవంతంగా నడుస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త సర్క్యూట్లతో పాలమూరులో పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించాలని జిల్లాకే చెందిన పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ప్రయత్నిస్తున్నారు.
ట్రిప్ ఎంజాయ్ చేశాం..
ట్రిప్ ఓవరాల్గా బాగుంది. బాగా ఎంజాయ్ చేశాం. ప్రస్తుతం ఉన్న ప్రదేశాలతోపాటు ఇంకా కొన్నింటిని పెంచి సమయం పెంచితే బాగుంటుంది. గతంలో ఎప్పుడూ లేని ప్రయత్నం చేయడం గొప్ప విషయం.
టూరిజం సర్క్యూట్ బాగుంది..
కేవలం రూ.300కే ఏసీ బస్సులో మూడు ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించే అవకాశం కల్పించారు. టూరిజం సర్క్యూట్ చాలా బా గుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సు లో చక్కగా పర్యటించాం. పిల్లలమర్రి పచ్చ గా మారిన తర్వాత చూడడం బాగా అనిపించింది. పిల్లలమర్రిలో మర్రిచెట్టుతోపాటు మ్యూజియం, జూ, పురాతన గుడి చూడడం మరపురాని అనుభూతి.
మన్యంకొండలో వీఐపీ దర్శనం ..
గతంలోనూ మన్యంకొండ వెళ్లాం. కానీ ఇలా ప్రత్యేకంగా ఏసీ బస్సులో పర్యాటకుడి లా వెళ్లడం బాగా అనిపించింది. మన్యంకొండలో వీఐపీ దర్శనం చేయించారు. పిల్లలమ ర్రి, కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు సందర్శించ డం కొత్తగా అనిపించింది. ఉరుకులు పరుగు ల జీవితంలో ఇలా టూర్ వెళ్లడం ఉపశమనమిస్తుంది. ఇలాంటి సర్క్యూట్లు మరిన్ని అందుబాటులోకి రావాలి.