భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరో దారుణం జరిగింది. గిరిజన బాలిక స్కూల్ డ్రెస్ మురికిగా ఉందని ఆరోపించిన టీచర్ తరగతిలో అంతా చూస్తుండగా డ్రెస్ విప్పించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు ఆ ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. షాడోల్ జిల్లాలోని గిరిజన గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గిరిజన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల గిరిజన బాలిక స్కూల్ డ్రెస్ మురికిగా ఉండటాన్ని ఉపాధ్యాయుడు శ్రవణ్ కుమార్ త్రిపాఠి గమనించాడు. క్లాస్ రూమ్లో అందరి ముందు ఆ బాలికతో స్కూల్ డ్రెస్ విప్పించాడు. దీంతో ఆమె కొన్ని గంటలపాటు కేవలం లోదుస్తులతో క్లాసులో ఉంది.
కాగా, టీచర్ శ్రవణ్ కుమార్ అనంతరం మురికిగా ఉన్న గిరిజన బాలిక స్కూల్ డ్రెస్ను ఉతికాడు. దీంతో ఆ డ్రెస్ ఆరేంత వరకు ఆ బాలిక కేవలం లోదుస్తులతో క్లాస్ రూమ్లో కూర్చొంది. అయితే అంతటితో ఆగని ఉపాధ్యాయుడు శ్రవణ్ కుమార్ ఫొటోలు తీశాడు. తనను తాను పరిశుభ్రత వాలంటీర్గా పేర్కొంటూ ఆ ఫొటోలను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం ఆ గిరిజన గ్రామస్తులకు తెలియడంతో ఆ టీచర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ సంఘటనపై అధికారులు స్పందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉపాధ్యాయుడు శ్రవణ్ కుమార్ త్రిపాఠిని శనివారం సస్పెండ్ చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ సహాయ కమిషనర్ ఆనంద్ రాయ్ సిన్హా తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు.