వరంగల్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ సీనియర్ నేత సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనను నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం గతంలోనే నిర్ణయం తీసుకోగా గవర్నర్ ఆమోదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కీలక నేతగా ఉన్న మధుసూదనాచారి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు.
సిరికొండ సేవలకు గుర్తింపుగా సీఎం కేసీఆర్ ఆయనను నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ తొలి స్పీకర్గా పని చేసిన మధుసూదనాచారి ఇప్పుడు ఎమ్మెల్సీ అయి రెండు సభలకు ప్రాతినిధ్యం వహించిన కొద్ది మంది నేతల్లో ఒకరిగా నిలిచారు. హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లికి చెందిన సిరికొండ మధుసూదనాచారి 1982లో టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. 1994లో అప్పటి శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీలో జరిగిన పరిణామాలతో లక్ష్మీపార్వతి వెంట ఉన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం ముందు నుంచి కేసీఆర్తో కలిసి ఉన్నారు.
టీఆర్ఎస్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా కీలకంగా పనిచేశారు. 2009లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో ఇదే స్థానం నుంచి గెలిచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి తొలి స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో భూపాలపల్లిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మధుసూదనాచారి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్కు సన్నిహితుడిగా ఉంటున్నారు. ఆయన ఎమ్మెల్సీ కావడంపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.