Macherla ASI : ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం పల్నాడు జిల్లా (Palnadu District) లో ఓ ఏఎస్సై నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. పర్యాటక ప్రాంతాల్లోని పార్కుల్లో ఏకాంతంగా గడుపుతున్న జంటలను మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్ (ASI Srinivas) రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏఎస్సై దందాకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రేమికులు, కళాశాల విద్యార్థులే లక్ష్యంగా ఏఎస్సై శ్రీనివాస్ దందాలకు పాల్పడుతున్నాడు. జమ్మలమడుగుకు చెందిన ఓ ఆటోడ్రైవర్తో జంటలు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీయించి, వారిని స్టేషన్కు తీసుకెళ్తానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వలేని యువతులను తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధిస్తున్నట్లు కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల మాచర్లలోని ఓ వ్యాపారి, ఓ మహిళతో ఏకాంతంగా ఉన్న వీడియో తీసి, వారిని బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాచర్ల పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తున్న మరో ఎస్సై, కానిస్టేబుల్కు కూడా ఈ దందాలో భాగం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ కృష్ణారావు స్పందించారు. విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.