హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో హుజురాబాద్ ఉప ఎన్నికల రణం ముగియకముందే మరో వివాదం రాజుకొంటున్నది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నియామకాలపై అసంతృప్తి రగులుతున్నది. కమిటీకి వైస్ చైర్మన్గా తనను నియమించడం పట్ల రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ అసంతృప్తి, ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తనను సంప్రదించకుండానే పేరు ప్రకటించారని, ఈ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేనంటూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖరాశారు. ఈ కమిటీకి చైర్మన్గా జీ చిన్నారెడ్డి, వైస్ చైర్మన్గా ఎంఏ ఖాన్, సభ్యులుగా శ్యాంమోహన్, గడ్డం వినోద్, సౌదాగర్, బీ కమలాకర్రావు, సీజే శ్రీనివాస్రావును నియమిస్తూ ఈ నెల 3న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మృదుస్వభావుడైన చిన్నారెడ్డిని ఈ పదవికి ఎంపిక చేసి ఆయనను కూడా ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర నాయకులే ఈ కుట్రకు తెరలేపారనే విమర్శలొస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారని, కీలకమైన విభాగాల ఏర్పాటులో ఇంత అలసత్వం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.