హైదరాబాద్, డిసెంబరు 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం.. దేశ ఆర్థికాభివృద్ధికి అత్యంత కీలకమైన రోడ్ల విస్తరణ విషయంలోనూ అదే ధోరణి కొనసాగిస్తున్నది. రాష్ట్రంలో 4 వేల కిలోమీటర్ల పీఎంజీఎస్వై రోడ్లను 3.75 మీటర్ల నుంచి 5.5 మీటర్లకు వెడల్పు చేయాలని సీఎం కేసీఆర్ లేఖ రాస్తే.. కేంద్రం మాత్రం 750 కిలోమీటర్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ అన్యాయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మంగళవారం నిండు పార్లమెంట్లో అంగీకరించారు.
లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 325 కి.మీ. రోడ్లతోపాటు 40 బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. దేశంలో 100 నుంచి 249 జనాభా ఉన్న తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు 109 ఉన్నట్టు గుర్తించామని, వీటిలో 107 అవాసాలకు రోడ్డు సౌకర్యం కల్పించామని చెప్పారు. తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలకు 698 కి.మీ. రోడ్లను, 33 బ్రిడ్జిలను మంజూరు చేశామని, వీటిలో ఇప్పటివరకు 227 కి.మీ. రోడ్లు, 7 బ్రిడ్జిల నిర్మాణ పనులు పూర్తయ్యాయని వివరించారు.