బెంగళూరు : కొవిడ్ కేసుల పెరుగుదలతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నది.. వచ్చే 15 రోజుల పాటు రాష్ట్రంలో ర్యాలీలు, నిరసనలపై నిషేధం విధించింది. ఈ మేరకు సీఎం యడ్యూరప్ప ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ పరిస్థితిపై ఆరోగ్యశాఖ అధికారులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా లాక్డౌన్ విధించేది లేదని స్పష్టం చేశారు. వైరస్ కట్టడికి ర్యాలీలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని, రద్దీని నివారించాలని ఈ సందర్భంగా ప్రజలకు యడ్యూరప్ప విజ్ఞప్తి చేశారు.
కొవిడ్ పరిస్థితిని పరిశీలన, నియంత్రణకు ఎనిమిది జోన్లకు ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్యను నియంత్రించేందుకు ప్రభుత్వం కష్టపడుతుందని ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అశోక తెలిపారు. మార్గదర్శకాలు పాటించకపోతే మండపాల నిర్వాహకులకు భారీ జరిమానాలు విధించడంతో పాటు ఆరునెలలు మూసివేయనున్నట్లు హెచ్చరించారు. సోమవారం కర్ణాటకలో 2,792 కొవిడ్ పాజిటివ్ కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి.