ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు మళ్లీ టీఆర్ఎస్కే దక్కాయి. రెండు స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికకాగా.. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. ఇక్కడ అధికార పార్టీకి మెజార్టీ ఓటర్లు ఉండడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. అలాగే ఒక స్వతంత్ర అభ్యర్థి వేసిన నామినేషన్ కూడా అసంపూర్తిగా ఉండడంతో తిరస్కరణకు గురైంది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగీవ్రం కాగా, ఎన్నికల అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, నవంబర్ 24 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ను ఎన్నికల యంత్రాంగం తిరస్కరించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ రోజు పోటీలో ఒక్కరు మాత్రమే ఉన్నట్లయితే ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో టీఆర్ఎస్ తరఫున అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజుకు పోటీగా ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శుక్రవారం ప్రకటించనున్నారు. అనంతరం ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు.
రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో భాగంగా బుధవారం ఎన్నికల పరిశీలకుడు చంపాలాల్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.అమయ్కుమార్ ఆధ్వర్యంలో సమావేశమైన ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రం అసంపూర్తిగా ఉన్న దృష్ట్యా స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ను తిరస్కరిస్తూ నిర్ణయించారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత నామినేషన్ వేయడంతోపాటు డిపాజిట్ డబ్బులు చెల్లించకపోవడం, నామినేషన్ను బలపరిచేవారి సంతకాలు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
వరుసగా రెండోసారి ఎన్నిక
ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు వరుసగా రెండోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎన్నిక కానున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండగా.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఓటర్లు ఉండడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండడం, నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి శంభీపూర్ రాజుతోపాటు పట్నం నరేందర్రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. తదనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పట్నం నరేందర్రెడ్డి పోటీ చేసి, గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్పడింది. అదే సమయంలో తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పట్నం మహేందర్రెడ్డి ఓడిపోవడంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానంలో మహేందర్రెడ్డిని బరిలోకి దింపడంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మూడు దఫాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగగా, వరుసగా రెండు పర్యాయాలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాలను చేజిక్కించుకోవడం గమనార్హం.