హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ తెలుగు సాహితీవేత్త శారదా అశోకవర్ధన్ (87) కన్నుమూశారు. బంజారాహిల్స్లోని తన కుమార్తె నివాసంలో బుధవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు సాహిత్యరంగంలో నవలలు, కవిత్వాలు, నాటకాలు, వ్యాసాలు, గేయాలు, బాలల సాహిత్యం, వార్తా పత్రికా వ్యాసాలు వంటి విభిన్న రంగాల్లో ఆమె ప్రతిభచాటారు. 80కి పైగా పుస్తకాలు రాసి సాహిత్యరంగంలో చెరగని ముద్ర వేశారు. ఆలిండియా రేడియోలో చాలా ఏండ్లు పనిచేశారు. ఆమె రచించిన గేయాల్లో ‘మనసాయేర మాధవ’ ‘గణపతి సుప్రభాతం’ విశేష ఆదరణ పొందాయి. ఆమె రచనలు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి అనువదించారు. జవహర్ బాల భవన్ డైరెక్టర్గా సైతం ఆమె విశేష సేవలందించారు. ఆమె తన జీవన ప్రయాణంలో మూడు నంది అవార్డులతోపాటు తెలుగు విశ్వ విద్యాలయ అవార్డు, సుశీల నారాయణ రెడ్డి అవార్డు, రాజ్యలక్ష్మి లాంటి అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. శారదా అశోక వర్ధన్కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆమె మరణం సాహిత్య రంగానికి తీరని లోటని పలువురు రచయితలు పేర్కొన్నారు.