నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 5 : మండలంలోని మల్లారం గ్రామశివారులో ఉన్న లింగేశ్వరగుట్ట ఆశ్రమ వార్షికోత్సవాలను సోమవారం నుంచి బుధవారం వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆశ్రమ నిర్వాహకులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. పీఠాధిపతులు వార్షికోత్సవ వేడుకలకు తరలిరానున్నారు. వార్షికోత్సవాల్లో భాగంగా తొలిరోజైన సోమవారం వర్గల్ పీఠాధిపతి మధుసూదానంద సరస్వతీస్వామీజీ రానున్నారు. అఖండదీపారాధన, గణపతిపూజ, లక్ష బిల్వార్చన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 7వ తేదీన రంగపేట్ పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామీజీ, చివరి రోజైన 8న హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతీస్వామి హాజరుకానున్నారు.
రెండు దశాబ్దాల్లో ఎంతో మార్పు..
ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణంతో ఆకట్టుకుంటున్న లింగేశ్వరగుట్ట ఆశ్రమాన్ని పిట్ల కృష్ణమహరాజ్ 23ఏండ్ల క్రితం స్థాపించారు. దట్టమైన అటవీప్రాంతంలో చిన్న పందిరి వేసి సాధన ప్రారంభించిన మహరాజ్ శివలింగాన్నిప్రతిష్ఠించి ప్రతిరోజూ పూజలు చేసేవారు. భక్తుల రాకపోకలు ప్రారంభంకావడంతో ఆశ్రమం రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక్కడి శివయ్యను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఆశ్రమ ఆవరణలో శివాలయంతోపాటు దత్తాత్రేయ, కాలభైరవ, నటరాజ, అమ్మవారి ఆలయాలు ఉన్నాయి.
ఇక్కడి గోశాలలో 150 ఆవులు ఉన్నాయి. గోశాల నిర్వహణకు ప్రత్యేకంగా ఇద్దరిని నియమించారు. మహాశివరాత్రితోపాటు ఇతర పర్వదినాలలో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాల నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.