‘వరంగల్ గడ్డ గురించి నాకు బాగా తెలుసు. నా పదేళ్ల వయసున్నప్పుడు స్కూల్ తరపున ఇక్కడకు వచ్చాను. నా గురువులు ఈ నేల గొప్పదనం గురించి చెప్పారు. చిన్నతనంలో వేయి స్తంభాల గుడికి వచ్చినప్పుడు ప్రతి స్తంభాన్ని లెక్కబెట్టుకుంటూ తిరిగాను. అప్పటి నుంచి నాకు ఈ నగరంతో అనుబంధం ఉంది. కళలకు పుట్టినిల్లు వరంగల్. ఇక్కడ కళల్ని, కళాకారుల్ని ఎంతగానో ఆదరిస్తారు. సినిమాలంటే ప్రాణమిస్తారు. పోతన, పీవీ నరసింహారావు, కాళోజీ వంటి మహానుభావులు ఈ నేల నుంచే వచ్చారు. అందుకే నాకు వరంగల్ అంటే సెంటిమెంట్. ఇక నుంచి ప్రతి వేడుక వరంగల్లోనే జరుపుకుంటాం’ అన్నారు పూరి జగన్నాథ్. ఆయన తనయుడు ఆకాష్పూరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకుడు. కేతికశర్మ కథానాయిక. పూరిజగన్నాథ్, ఛార్మి నిర్మించారు. ఈ నెల 29న విడుదలకానుంది. శుక్రవారం వరంగల్లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హీరో విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఈ టీమ్ అంతా నాకు కావాల్సిన వాళ్లు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటా. దర్శకుడు అనిల్ నా ‘లైగర్’ సినిమా సీజీ వర్క్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఆయన మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సూపర్హిట్ కావాలని ఆశిస్తున్నా. పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా ప్రేమ. ఆయన తనయుడు ఆకాష్లో మంచి ఫైర్ ఉంది. ఆకాష్ సినిమా పిచ్చి గురించి పూరి, ఛార్మి నాకు ఎప్పుడూ చెబుతుంటారు. ఆకాష్ తప్పకుండా సక్సెస్ అవుతాడు. ‘లైగర్’ సినిమా గురించి అస్సలు మాట్లాడొద్దనుకున్నా. అయితే అందరూ ‘లైగర్’ గురించి ఎదురుచూస్తున్నారు. విధి పూరిజగన్నాథ్ గారిని నా లైఫ్లోకి తీసుకొచ్చింది. ‘లైగర్’ సినిమా గురించి మా టీమ్ అంతా శ్రమిస్తున్నాం. ఆ సినిమాతో ఇండియా షేక్అవ్వాలని అందరం ఫిక్స్ అయిపోయాం. 2022లో మీ ముందుకొస్తాం’ అన్నారు. మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ ‘ వరంగల్లో ఎలాంటి కార్యక్రమం మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. విజయాల గడ్డ ఇది. హైదరాబాద్ తర్వాత ప్రతి సినీ వేడుకను వరంగల్లో నిర్వహించాలని చిత్ర ప్రముఖులను కోరుతున్నా. వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని నేను హామీ ఇస్తున్నా. వరంగల్లో ఉన్న పురాతన కోటలు, ఆలయాల్ని ప్రభుత్వ సహకారంతో పునరుద్ధరిస్తున్నాం. పాకాల, లక్నవరం చెరువుల అందాలు ఆకట్టుకుంటాయి. వీటితో పాటు వరంగల్ జిల్లాలో ఎన్నో అందమైన లొకేషన్స్ ఉన్నాయి. తమ షూటింగ్ల కోసం సినీ దర్శకనిర్మాతలు ఈ జిల్లాకు రావాలి. హీరో విజయ్ దేవరకొండను నేను కుటుంబసభ్యుడిగా భావిస్తాను’ అని తెలిపారు. ఆకాష్పూరి మాట్లాడుతూ ‘ఎలాంటి కుటుంబనేపథ్యం లేకుండా చిత్రసీమలోఅడుగుపెట్టిన నాన్న పూరిజగన్నాథ్ కష్టపడి పైకి వచ్చాడు.పూరి జగన్నాథ్ పని అయిపోయింది అన్న ప్రతిసారి నిలబడ్డాడు. సక్సెస్, ఫెయిల్యూర్ ముఖ్యంకాదు. ఇష్టమైన పనిలో కొనసాగాలని నాన్న చెప్పారు. బ్యాక్గ్రౌండ్ ఉండి సక్సెస్ సాధించలేనివాడికి ఇండస్ట్రీలో విలువ ఉండదు. అందుకే ప్రతి సినిమాను ప్రాణంపెట్టి పనిచేస్తా. నన్ను చూసి నాన్న గర్వపడే రోజు వచ్చేలా కష్టపడతానని ఆయనకు మాట ఇస్తున్నా’ అని తెలిపారు.