రాజేష్! రేపు నేను మాధవ్ అంకుల్ దగ్గరికి, కరీంనగర్ వెళ్లాలి. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చెయ్. ఎన్ని రోజులుంటానో తెలియదు. మెడిసిన్స్, డ్రెస్సులు.. ఇంకా అవసరమైనవన్నీ సిద్ధం చేయించు” అన్నాడు సాగర్.. కొడుకుతో.
“అదేంటి నాన్నా! అసలే మీ ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంది. ఇప్పుడు ప్రయాణమేమిటి? కొంచెం కోలుకున్నాక వెళ్లొచ్చు కదా!?” అన్నాడు రాజేష్.
“ఇప్పుడు వెళ్లకపోతే ఎప్పుడు వెళ్తానో చెప్పలేను. అక్కడికి వెళ్లకపోతే తీరని అసంతృప్తి, అశాంతి మిగిలిపోతుంది. నన్ను వెళ్లనివ్వు”.. శాసిస్తున్నట్లు అన్నాడు సాగర్.
నాన్న ఒక నిర్ణయానికి వస్తే ఇక ఎవ్వరి మాటా వినడన్న విషయం తెలిసిన రాజేష్.. అన్యమనస్కంగానే ‘సరే!’ అన్నాడు.
సాగర్.. ఎలక్ట్రానిక్స్ రంగంలో అంతర్జాతీయంగా పేరు గడించిన ప్రముఖ వ్యాపారవేత్త. ఇంజినీరింగ్ చేసిన తరువాత, అమెరికా వెళ్లి వ్యాపారాన్ని ప్రారంభించి.. వేలకోట్ల టర్నోవర్తో ఇటు భారత్లోనూ, అటు ఇతర దేశాల్లోనూ విస్తరింపజేసి.. బిలియనీర్గా ఎదిగాడు. పెద్దకొడుకు అఖిల్ తనతోపాటు అమెరికాలో వ్యాపార లావాదేవీలు చూస్తుండగా, చిన్నకొడుకు రాజేష్ భారత్లో బిజినెస్ చూసుకుంటున్నాడు.
ఎప్పుడో రక్తసంబంధీకుల వివాహాలు మొదలైన వేడుకలు, వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన సందర్భాల్లో తప్ప భారత్కు రాని సాగర్.. తన డబ్భు ఏళ్ల వయసులో, విదేశాల్లో ఉన్న తన వ్యాపార కార్యకలాపాలన్నీ పెద్ద కొడుక్కు అప్పజెప్పి, ఈమధ్యనే భారత్ వచ్చాడు. అదికూడా హైలెవల్ బీపీ, షుగర్, సెకండ్ స్టేజ్ ప్రొస్టేట్ క్యాన్సర్ మొదలైన వార్ధక్య వ్యాధులతో స్వదేశానికి శాశ్వతంగా తిరిగి వచ్చాడు.
రెండేళ్ల క్రితమే భార్య చనిపోయి, ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సాగర్లో, భారత్ వచ్చినప్పటి నుంచీ ఇన్నాళ్లులేని ఒక సంఘర్షణ మొదలైంది. ఇంతకాలం వ్యాపారంలో తలమునకలై ఉండి, క్షణం తీరిక లేకుండా గడపడం వల్ల ఈ సంఘర్షణకు తావు లేకుండే. ఊహించని వ్యాధులు చుట్టుముట్టి, శరీరం శుష్కించి, సత్తువ, చైతన్యం సన్నగిల్లాక.. మొదటిసారి ఈ సంఘర్షణకు లోనై, చెట్టును చెదపురుగు తొలిచినట్టు.. అనేక ఆలోచనలు తన మనసును తొలుస్తున్నాయి.
‘పరిగెత్తీ పరిగెత్తీ సాగే జీవిత ప్రస్థానానికి అంతిమ పరమార్థం ఏమిటి? రాత్రీ పగలు కష్టపడి, పోటీ ప్రపంచంలో విజేతగా నిలవడానికి ఎంత వ్యక్తిగత జీవితాన్ని, ఎన్ని సంతోషాలను త్యాగం చేశాను. మరిప్పుడు నేను విజేతనా.. పరాజితుణ్నా? ఇంత సంపద నన్ను వ్యాధి పీడితున్ని కాకుండా ఆపగలిగిందా? అంతిమదశలో ఆనందంగా జీవితాన్ని ముగించే ఆహ్లాదకర పరిస్థితుల్ని మిగిల్చిందా? వ్యాపారంలో నెగ్గడానికి ఎన్ని అపసవ్య మార్గాలను ఎంచుకున్నాను? ఇంతా చేసి, ఇదంతా మనిషి జన్మ ఎత్తినందుకు జీవితానికి సార్థకతను చేకూర్చిందా?’ అన్న తాత్విక ఆలోచలన్నీ తాచుపాములై చిత్తంలో బుసలు కొడుతున్నాయి.
ప్రయాణం ఆరంభమైనప్పటి నుంచీ తన చిన్ననాటి స్నేహితులు, సొంత ఊరైన కరీంనగర్ జ్ఞాపకాలు.. కారుతో పోటీ పడుతూ, వేగంగా అతని మనోమైదానంలో పరుగులు తీస్తున్నాయి.
ఇప్పటి ఈ తలపోతల తలుపు తట్టిన మరో కారణమూ ఉంది. తన బాల్యస్నేహితుడు, ఇంటర్మీడియెట్ వరకూ సహాధ్యాయి అయిన మాధవ్ జీవితంతో, తన జీవితాన్ని పోల్చుకుంటున్నాడు.
ఉపాధ్యాయుడిగా రిటైర్ అయినప్పటినుంచీ కొన్నాళ్లుగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో, శాస్త్రీయ అవగాహనను విస్తరింపజేయడంలో మాధవ్ చేస్తున్న కార్యక్రమాల వార్తల పేపర్ కటింగ్స్ అన్నీ సాగర్కు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. మొదట్లో వాటిని శ్రద్ధగా చదివినా, అవన్నీ ఏదో వాడి కాలక్షేపానికి చేస్తున్న కార్యక్రమాలని అనుకొని మళ్లీ మర్చిపోయేవాడు.
కానీ, ఈ మధ్యన వరుసగా పంపించిన కొన్ని కార్యక్రమాల పేపర్ కటింగ్స్, వేరువేరు రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొంది, విశేషఖ్యాతిని గడించిన కొందరి ఇంటర్వ్యూలు, విశేషాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వాళ్లందరూ కూడా మాధవ్ నడిపిస్తున్న ‘చార్వాక నాలెడ్జ్ సెంటర్’ ద్వారా పొందిన స్ఫూర్తే తమ విజయాలకు, ఎదుగుదలకు, చైతన్యానికి మూలమని ప్రకటించడం.. సాగర్లో ఆసక్తిని రేపింది.
పాఠశాల స్థాయిలో తాను చదువుకున్న ధన్గర్వాడీ హైస్కూల్లో సాగర్కు మాధవ్ ప్రాణస్నేహితుడు. ఇద్దరూ పేద కుటుంబాల్లోంచి వచ్చినవాళ్లే. ఇద్దరూ తెలివైన విద్యార్థులే. మొదటినుంచీ సాగర్కు బాగా చదివి గొప్ప ఇంజినీర్ కావాలనీ, జీవితంలో బాగా స్థిరపడాలనీ బలమైన కోరిక ఉండేది. చదువు తప్ప వేరే ఏ ఇతర విషయాల్లోనూ తలదూర్చేవాడు కాదు. కానీ, మాధవ్ చదువుతోపాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. ప్రశ్నించే తత్వాన్ని మెండుగా కలిగినవాడు. ఆ వయసులోనే సమాజంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక అంతరాల గురించి టీచర్లను ప్రశ్నించేవాడు.
‘పెద్దయ్యాక అన్నీ తెలుసుకోవచ్చు. ముందు బాగా చదువుకో..’ అని టీచర్లు సర్దిచెప్పేవాళ్లు.పదో తరగతిలోనే పాఠ్యపుస్తకాలతోపాటు ఇతర సాహిత్యాన్ని చదవడం అలవాటైంది.
ఇంటర్మీడియెట్లో ఇద్దరూ ఎంపీసీలో చేరారు. అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వామపక్ష ఉద్యమాలతో కరీంనగర్ కల్లోల కడలిలా ఉంది. పల్లెల నుంచి వచ్చిన శ్రామిక, ఉత్పత్తి కులాల పిల్లలంతా ఆ ఉద్యమాలకు ప్రభావితం అవుతున్న కాలం. తమ తండ్రులు తాతల వెట్టి జీవితాలకు, తమ వెనుకబాటుతనానికీ కారణమైన భూస్వామ్య దోపిడీ మూలాలను విప్పి చెబుతుంటే.. ఎందరో విద్యార్థులు త్యాగాలకు సిద్ధమై ఉద్యమాల్లోకి ఉరుకుతున్న సమయం.మాధవ్ కూడా విద్యార్థి ఉద్యమాల్లో కీలక భూమిక పోషించసాగాడు. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని, అభ్యుదయ, విప్లవ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. సామ్యవాద సిద్ధాంతమే సాంఘిక, ఆర్థిక అసమానతలకు విముక్తి మార్గమని తన ఉపన్యాసాల్లో అనర్గళంగా మాట్లాడేవాడు.
సాగర్ కంటే మాధవ్ మెరిట్ స్టూడెంటే అయినా.. ఉద్యమ ప్రభావంతో చదువును అశ్రద్ధ చేయసాగాడు. పైగా ఈ చదువులు జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దలేవని, మనుషుల్ని కేవలం కెరియరిస్టుగానే మిగులుస్తాయని వాదించేవాడు. క్రమంగా విద్యార్థి ఉద్యమాల్లోంచి, ప్రజా ఉద్యమాల్లోకి వెళ్లాడు. రైతు కూలీ సంఘాలతో కలిసి పోరాటాలు చేయడం వల్ల కాలేజీకి దూరమయ్యాడు. ఎలాగోలా ఇంటర్మీడియెట్ పాస్ అయ్యాడు కానీ, తరువాత చదువు కొనసాగించలేక పోయాడు.
సాగర్ మాత్రం.. తాను అనుకున్నట్లే ఇంటర్మీడియెట్ తరువాత ఇంజినీరింగ్ సీటు సంపాదించుకొని, అది పూర్తికాగానే వివాహం చేసుకోవడం, అతని మామ స్థితిమంతుడు కావడంతో ఆయన సపోర్ట్తో అమెరికా వెళ్లడం, తరువాత ఎలక్ట్రానిక్స్ రంగంలోకి ప్రవేశించి గొప్ప వ్యాపారవేత్తగా స్థిరపడిపోవడం జరిగిపోయింది.
మాధవ్ రెండేళ్లు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి, నిర్బంధం తీవ్రతరం కావడంతో ఉద్యమంలోంచి బయటికి వచ్చి.. తిరిగి డిగ్రీ, బీఎడ్ చేసి టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. అయితే అలలను పట్టి బంధించడం, కలలను కట్టడి చేయడం ఎవరితరం? ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నప్పుడు కూడా అతని చైతన్యం అతణ్ని స్తబ్ధంగా ఉండనివ్వలేదు. తిరిగి ఉపాధ్యాయ సంఘంలో క్రియాశీలకంగా పనిచేశాడు. కవిగా, రచయితగా ప్రజా జీవితంలోని సంక్షోభాలను, ప్రభుత్వం కొనసాగిస్తున్న జీవన విధ్వంసాన్ని వస్తువుగా చేసుకొని, అద్భుతమైన కవిత్వం, కథలు రాశాడు. మూఢ విశ్వాసాల ముసుగు విప్పుతూ కులం పేర, మతం పేర జరుగుతున్న అమానవీయ సంఘటనలను, ఛాందస భావాలను ఎండగడుతూ.. శాస్త్రీయ జ్ఞానం, తార్కిక చింతన జీవితాన్ని ఎంత అర్థవంతంగా మారుస్తాయో, అభ్యుదయ సమాజ నిర్మాణానికి ఎలా దోహదపడుతుందో సభలు, సమావేశాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాడు.
సాగర్ అమెరికాలో ఉన్నప్పుడు చిన్ననాటి క్లాస్మేట్స్ ఎవరితోనూ కమ్యూనికేషన్ ఉండేది కాదు. కేవలం మాధవ్ ఒక్కడే సాగర్తో టచ్లో ఉంటూ తను చేస్తున్న కార్యక్రమాలను షేర్ చేసుకునేవాడు. పదేళ్లక్రితం మాధవ్ రిటైర్ అవుతున్న సందర్భంలో ప్రస్తావించిన విషయం.. ఈ ప్రయాణంలో సాగర్కు మళ్లీ గుర్తుకొస్తుంది.
“ఒరేయ్ సాగర్.. రిటైర్ అయిన డబ్బులతో కరీంనగర్ను ఆనుకొని ఉన్న మానేరు నది ఒడ్డున ఎకరం స్థలం కొని, దానిని సాహిత్య, సాంస్కృతిక, జ్ఞాన కేంద్రంగా ఏర్పాటుచేసి, ఆయా రంగాల్లో నిష్ణాతులైన సాహితీవేత్తలు, కళాకారులు, విద్యావేత్తలు, వైజ్ఞానిక వేత్తలతో నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నాను. ఏమంటావురా?”..
అందుకు మాధవ్ను వారించాడు సాగర్.“జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బును, సమాజ సేవా కార్యక్రమాలకని ఖర్చు చేస్తే.. విశ్రాంత జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఎవరు ఆదుకుంటారు?” అన్నప్పుడు..“అనిశ్చితమైన నా భవిష్యత్తు కోసం, నిశ్చయంగా నేను ఆశించే లక్ష్యాన్ని దూరం చేసుకోలేను. సమాజం నుంచి నేను పొందినదేమిటో, నా జీవితం నాకు రుజువు పరిచింది. పోతూ పోతూ నేనూ ఈ సమాజానికి మంచినేదో కొంత అందించి పోవాలి. ఈ నాలెడ్జ్ సెంటర్ కేంద్రంగా నేను చేసే కార్యక్రమాలతో స్ఫూర్తి పొందిన కొత్తతరానికి చెందిన కొందరైనా అభ్యుదయ ఆలోచనల్ని, శాస్త్రీయ దృక్పథాన్ని తప్పకుండా అందిపుచ్చుకుంటారు”.. స్థిరంగా అన్నాడు మాధవ్.పదేళ్ల క్రితం మాధవ్ కలగన్న స్వప్నం, ఈనాడు నిజమై ఫలితాన్నిస్తున్నది. మాధవ్ ఆలోచన సాగర్కు అప్పుడు మూర్ఖంగా అనిపించినా, ఇప్పుడు దాని విలువ ఏమిటో, సమాజం స్పందిస్తున్న తీరుతో సాగర్కు అర్థమైంది.
సాగర్ చేరాల్సిన గమ్యం రాగానే అప్పటిదాకా కురిసిన జ్ఞాపకాల జడివాన ఒక్కసారిగా ఆగిపోయింది. ఎదురుగా ‘చార్వాక జ్ఞానకేంద్రం’ అన్న బోర్డు కనిపించింది. కళ్లతోనే చుట్టూ పరిసరాలను ఒక్కసారి అట్లా చూశాడో లేదో.. సాగర్ కళ్లల్లో కాంతిపూలు పూశాయి.
కారు దిగగానే ఎదురు చూస్తున్న మాధవ్.. తన మిత్రుణ్ని ఆప్యాయంగా గుండెకు హత్తుకున్నాడు.“ఇప్పటికి నీ దగ్గరికి రావాలన్న నా కోరిక నెరవేరిందిరా మాధవా!” అన్నాడు సాగర్.
అది సాయంత్రం సుమారు ఆరుగంటల సమయం. దినమంతా లోకాన్ని వెలిగించి, పడమటి పడక నెక్కబోతున్న సూర్యునిలోని ఎర్రెర్రని ఎరుపు, మాధవ్లోని చైతన్యానికి ప్రతీకగా తోచింది సాగర్కు.చుట్టూ పళ్ల చెట్లు, పూల మొక్కలతో నిండి ఉన్న పచ్చని వాతావారణం. మధ్యలో సుమారు రెండు మూడు వందల మంది కూర్చోగలిగే పెద్ద హాలు.. బెంగుళూర్ టైల్స్తో కళాత్మకంగా నిర్మితమైంది. లోపల పెద్ద వేదిక. లోపలి గోడలపై గౌతమ బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్తోపాటు భారతీయ తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, సాహితీవేత్తల చిత్రపటాలు ఒకవైపు.. బ్రూనో, సోక్రటీస్, మార్క్స్, లెనిన్, ఎంగెల్స్ వంటి పాశ్చాత్య తత్వవేత్తల చిత్రాలు, భగత్సింగ్, అల్లూరి, కొమురంభీం వంటి పోరాటయోధుల ఫొటోలు క్రమపద్ధతిలో అమర్చి ఉన్నాయి. ఇంకో గోడపై దాని నిర్మాణానికి సహకరించిన దాతలపేర్లు రాసి ఉన్నాయి.
హాల్ పక్కనే ఒక లైబ్రరీ, దాని నిండా వందలాది పుస్తకాలు. రెఫరెన్స్ కోసం అక్కడికివచ్చే రీసెర్చ్స్కాలర్స్ కొన్నిరోజులు ఉండాల్సి వస్తే.. వారికోసం చిన్నచిన్న గదులు నిర్మించారు. ఇంకోవైపు మాధవ్ నివాసం ఉంటున్న అందమైన కుటీరంలాంటి ఇల్లు. వీటికి ఎదురుగా యోగాసాధన కోసం పెద్ద లాన్. అందంగా క్రమపద్ధతిలో పెరుగుతున్న పూలమొక్కలు. వాటిమధ్య తిరుగాడుతున్న వివిధ రకాల కోళ్లు, బాతులు, ఇతర పక్షులు, కొన్ని కుందేళ్లు. పక్కనే మానేరు తీరం. దూరంగా వినిపిస్తున్న నెమళ్ల కూతలు. ఆహ్లాదకరమైన గాలి.. సాగర్ను పరవశింప చేస్తున్నాయి.
రాత్రి భోజనం చేసిన తరువాత ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలని సాగర్కు ఉన్నపటికీ..“ప్రయాణ బడలికతో ఉన్నావు.. రెస్ట్ తీసుకోరా! రేపు ఎంతైనా మాట్లాడుకోవచ్చు” అన్న మాధవ్ మాటలతో.. ఏసీ లేనిదే కన్నుమూయని సాగర్, మానేటి అలలపై నుంచి వీస్తున్న మలయమారుత మార్దవ స్పర్శ ఒంటికి తాకగానే.. హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.
మునుపెన్నడూ విని ఎరుగని పక్షుల కిలకిలారావాల సంగీత ధ్వనులు చెవులకు సోకగానే ఐదు గంటలకే సాగర్ నిద్ర మేల్కొన్నాడు. అప్పటికే మాధవ్ మిత్రబృందం సుమారు ఇరవైమంది అక్కడికి చేరుకున్నారు. సాగర్ను తన చిన్ననాటి మిత్రునిగా అందరికీ పరిచయం చేశాడు మాధవ్. అందరూ కలిసి మానేరు తీరంలో మార్నింగ్ వాక్ చేస్తుంటే, చుట్టూ ఎగురుతున్న పక్షులు, మేనును గిలిగింతలు పెడుతున్న చల్లని గాలులు, అప్పుడే విచ్చుకుంటున్న భానుడి లేలేత కిరణాలు.. సాగర్కు కొత్త అనుభూతిని పంచుతున్నాయి.
మాధవ్ మిత్రుల్లో ఎక్కువగా విశ్రాంత ఉద్యోగులు, కొందరు యువకులు ఉన్నారు. ఒక్కొక్కరూ ఒక్కో జోక్ వేస్తున్నారు. పొట్టచెక్కలయ్యేలా కడుపారా హాయిగా నవ్వుకుంటున్నారు. సమకాలీన రాజకీయాలను భిన్నపార్శ్వాల్లో చర్చించుకుంటున్నారు. కొందరు పాటలు పాడుతున్నారు. ఇంకొందరు సాహిత్య విషయాలను చర్చకు పెడుతున్నారు. సుమారు గంటన్నర తరువాత అందరూ తిరిగి చార్వాక జ్ఞాన కేంద్రానికి వెళ్లి, వేడివేడి రాగి జావ తాగి వెళ్లిపోయారు.సాగర్ జీవితంలో ఏనాడూ ఇంత అందమైన ఉదయాన్ని చూడలేదు. నిద్రలేచింది మొదలు ఆలోచనలన్నీ వ్యాపారం మీదనే. పీఏ సిద్ధం చేసిన ప్రోగ్రాం ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకు దేశవిదేశాల్లోని డీలర్లతో వ్యాపార లావాదేవీలు, విస్తరణ ప్రణాళికలతో నిరంతరం మునిగిపోతుంటాడు. విందులు, వినోదాలు కూడా ఉంటాయి.. స్టార్ హోటళ్లల్లో, కోటీశ్వరుల బంగళాల్లో. అత్యంత ఖరీదైన పార్టీలలో పాల్గొన్నప్పటికీ.. అవి బిజీ జీవితంలో ఆటవిడుపుగా ఉండేవే కానీ, అనిర్వచనీయమైన ఆనందాన్ని పంచేవి కావు. అది ఈనాడు అనుభవించాడు సాగర్.
నేషనల్ సైన్స్ డే సందర్భంగా స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాన వక్తగా మాట్లాడటానికి వెళ్తూ.. సాగర్ను కూడా వెంట తీసుకువెళ్లాడు మాధవ్.
ప్రపంచంలోనే యువత సంఖ్య ఎక్కువగా కలిగిన భారతదేశం, భవిష్యత్తును శాసించగలిగే సత్తా కలిగి ఉందని చెబుతూ, యువత ఛాందస భావాలను విడనాడి, శాస్త్రీయ దృక్పథాన్ని, సృజనాత్మక ఆలోచనల్ని, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుంటే ప్రపంచానికే భారతదేశం మార్గదర్శకంగా నిలుస్తుందని చెబుతూ.. ఇంకా అనేక విషయాలను ప్రస్తావిస్తూ మాధవ్ చేసిన ప్రసంగం విన్నాడు సాగర్.మరునాడు సాయంత్రం, చార్వాక జ్ఞాన కేంద్రంలో పౌరహక్కుల సంఘం వాళ్లు ఏర్పాటుచేసిన సభలో ప్రధానవక్తతో పాటుగా, మాధవ్ మాట్లాడిన ప్రసంగం సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలలో అతనికున్న లోతైన అవగాహనకు దర్పణంలా ఉంది.
సాగర్కు మొదటిసారి మిత్రుడిమీద ఉన్న ప్రేమ స్థానంలో గౌరవం కూడా చోటుచేసుకుంది. మాధవ్తో గడిపిన బాల్యజీవితపు స్మృతులన్నీ ఒక్కొక్కటిగా మనోయవనికపై దృశ్యాలుగా కదలాడుతున్నాయి.“మాధవ్, నేనూ బుడిబుడి అడుగులతో ఒకేసారి బడిలో అడుగుపెట్టిన వాళ్లం. ఒకేరకమైన పేదరికం అనుభవించినవాళ్లం. ఇంటర్ వరకూ సమాంతర చలనంగా సాగిన జీవితం. తదనంతరం ఇద్దరి మధ్యా ఎంత వ్యత్యాసాన్ని తీసుకువచ్చింది? మేం నడిచిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో జీవితం ఎవరిని, ఏ తీరానికి చేర్చింది అన్నది మేం ఎంచుకున్న మా ప్రాథమ్యాలే నిర్దేశించాయి. నేను నా ఒక్కడి పేదరికాన్ని జయించడానికి శ్రమించి, విజయం సాధించాను. కానీ, మాధవ్ సామూహిక దుఃఖాన్ని తన దుఃఖంగా చేసుకొని, వ్యవస్థాగతమైన మార్పును ఆకాంక్షించాడు. వాడు వాడి లక్ష్యం సాధించడంలో కృతకృత్యుడయ్యాడు. తేడా నేను సాధించిన దానితో సంతృప్తి చెందడం లేదు. వాడు సాధించిన దానితో సంతృప్తిగా జీవిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే.. నాకు పొందడం మాత్రమే తెలుసు. వాడికి ఇవ్వడమే తెలుసు!” ముప్పిరిగొన్న ఆలోచనల్లోంచి తేరుకోగానే, ఏదో జ్ఞానబోధ జరిగినట్లు సాగర్ మనసు తేలిక పడింది.
చార్వాక జ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా భావసారూప్యత గల వ్యక్తులు, సమూహాల సహకారంతోనే సాధ్యమవుతున్నాయి. గోడల మీద రాసిన అనేక కొటేషన్లలో ఒకటి.. ‘సమాజం మీకెంతో ఇచ్చింది – సమాజానికి మీరెంతో కొంత ఇవ్వండి’. ఈ స్ఫూర్తితోనే అక్కడి కార్యక్రమాల్లో పాల్గొనే అనేకమంది స్వచ్ఛందంగా ఆర్థికసహాయం అందిస్తారు.
నెల రోజులుగా అక్కడే ఉండి, అక్కడి కార్యక్రమాలలో మాట్లాడుతున్న భిన్నరంగాలకు చెందిన వక్తల ప్రసంగాలు విన్న సాగర్లో ఒక గుణాత్మకమైన మార్పు చోటుచేసుకుంది. అసలైన జీవిత పరమార్థం బోధపడింది. తనలో మొదలైన సంఘర్షణకు సమాధానం దొరికినట్లయింది.
ఓరోజు సాయంత్రం మిత్రులిద్దరూ లాన్లో కూర్చుని, అప్పుడే తెంపుకొచ్చి కాల్చిన వేడివేడి మక్కకంకుల్ని తింటూ చిన్ననాటి ముచ్చట్లెన్నో కుప్పవోసుకుంటున్నారు. ఆ ముచ్చట్లను వినాలనుకుని వచ్చాయా అన్నట్లు, వాళ్ల చుట్టూ తిరుగుతున్నాయి సీతాకోకచిలుకలు. తింటూ తింటూ కొన్ని గింజల్ని విసిరేస్తుంటే.. వాటిని ఏరుకుంటూ గుంపుగా చేరాయి కోడిపిల్లలు. మాధవ్ పిలవగానే కుయ్ కుయ్మంటూ తోక ఊపుకొంటూ పక్కనే కూచొని ప్రేమను ఒలకబోస్తున్నాయి రెండు కుక్కపిల్లలు. మేనిని తాకుతున్న చల్లని గాలులు, చెవులకు వాయులీనాల గానాలు మంత్రస్వరంలో వినిపిస్తున్నట్లున్న మధురానుభూతి. ఆ ప్రశాంత సమయంలో సాగర్లో మళ్లీ ఆలోచనలు.
‘ఎప్పటికీ ఇక్కడే ఉంటే!? ఏమీలేకున్నా సరే.. అన్నీ వదిలేయవచ్చు. నిజానికి అన్నీ వదిలేయగలనా? అన్నీ వదిలేసి నన్ను నేను ఖాళీ చేసుకోగలనా? నాలో నిండా నిండి ఉన్న కోరికలు, స్వార్థం, అసంతృప్తి, అసూయల చెత్తనంతా ఖాళీ చేయకుండా మాధవ్ అనుభవిస్తున్న జీవన సౌందర్యాన్ని నాలోకి ఒంపుకోగలనా? ప్రతీక్షణం ఆనందంగా జీవించాలంటే, మరుక్షణమైనా మరణించడానికి సిద్ధంగా ఉండటమే కదా మార్గం’..
“ఓరేయ్ మాధవా! నిన్నొక మాట అడగాలనుందిరా”.
“అడగరా.. దానికి మొహమాటమెందుకు?”.
“నా శేషజీవితం నీతోపాటు ఇక్కడే గడిపేందుకు నాకు అవకాశమిస్తావా?”.
“ఆనందంగా ఉండొచ్చురా.. కానీ, సకల సౌకర్యాలను వదులుకొని నువ్విక్కడ..”
“ఆ సౌకర్యాలన్నీ భ్రమల బందీఖానాలో మనం కప్పుకొన్న ముసుగులు. అసలైన జీవన సాఫల్యత ఏమిటో ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నానురా!”.
మాధవ్.. సాగర్ చేతిని తన చేతిలోకి తీసుకొని..
“ఈ జ్ఞాన కేంద్రం నా ఆస్తి అని, నాకే సొంతమని ఏనాడూ భావించలేదురా! దీన్ని ఎప్పుడో సమాజపరం చేశాను. ఎందరో చేసిన త్యాగాల వెలుగులు మనవరకూ అందాయి. మనం కూడా కొంత త్యాగం చేస్తేనే ముందుతరాల వాళ్లు మెరుగైన జీవితాన్ని అందిపుచ్చుకుంటారు. మనం ఒక్కళ్లం చేస్తేనే జరగకపోవచ్చు. మనవంతుగా ఎంతోకొంత చేసి కొత్త బాట వేస్తే, ఇంకొందరెవరో ఆ బాటను విశాలం చేస్తారు!” అన్నాడు మాధవ్.
సాగర్ అమెరికాలో ఉన్న కొడుకును భారత్కు రప్పించి, ఇద్దరు కొడుకుల సమక్షంలో తన లాయర్తో వీలునామా రాయించాడు. తన అన్ని కంపెనీలలో కొడుకుల పేరుమీద ఉన్న షేర్లను ఇద్దరికీ సమంగా పంచేసి, తన పేరుమీదనున్న షేర్లన్నిటినీ చార్వాక జ్ఞాన కేంద్రానికి రాసిచ్చాడు.సాగర్ ఇప్పుడు సంపూర్ణంగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు… సంపదను, సకల బంధాలను, సమస్త మనోమాలిన్యాలను!ఇప్పుడతను జరామరణ భయాలు లేని అలౌకికానంద మానవుడు.
గాజోజు నాగభూషణం
అలిశెట్టి ప్రభాకర్ సాన్నిహిత్యంతో.. సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు గాజోజు నాగభూషణం. ఈయన స్వస్థలం జగిత్యాల. ప్రస్తుతం కరీంనగర్లో నివాసం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ.. కవి, రచయిత, గాయకుడిగానూ ప్రతిభ చాటుతున్నారు. కల్లోలిత ప్రాంతమైన జగిత్యాల చుట్టూ జరిగిన రైతాంగ ఉద్యమాల ప్రభావంతో కవిగా మారారు. ఆ తర్వాత నిరంతర ఉద్యమాల భాగస్వామ్యం, మానవ జీవన విధ్వంసమంతా కథల్లో ప్రతిఫలించడం వల్ల.. కథలు రాయడం ఆరంభించారు. కవిత్వంలో ‘మట్టి సరిగమలు’, ‘ప్రాణదీపం’ సంకలనాలు వెలువరించారు. ‘నెత్తుటి గాయాలు’ పేరుతో తెలంగాణ ఉద్యమ గేయాలు రచించి, గానం చేశారు. ఇప్పటివరకూ 20 కథలు రాశారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కథల పోటీల్లో వరుసగా మూడు సంవత్సరాలు బహుమతులు అందుకున్నారు. అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారంతోపాటు అనేక రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నారు. జీవితాన్ని ఉన్నతీకరించడంలో సాహిత్యానిది కీలక భూమిక అని విశ్వసిస్తారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.3 వేల బహుమతి
పొందిన కథ.
-గాజోజు నాగభూషణం
98854 62052