ముంబై, ఏప్రిల్ 27: ఎల్ఐసీ షేర్లు మే 17న స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఒక్కో షేరును రూ. 902-949 ధరల శ్రేణితో జారీచేసి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 21,000 కోట్లు సమీకరించనుంది. ఐపీవో వివరాల్ని బుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే మీడియాకు వెల్లడిస్తూ దీర్ఘకాలంలో కార్పొరేషన్ విలువను పెంపొందించాలన్న ప్రభుత్వం విజన్లో భాగంగా ఎల్ఐసీని లిస్ట్ చేస్తున్నామన్నారు.
ప్రస్తుత క్యాపిటల్ మార్కెట్ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే ఎల్ఐసీ ఆఫర్ పరిమాణం సరైనదని, మార్కెట్లోకి షేర్ల సరఫరా అధికంకాబోదని పాండే చెప్పారు. ఐపీవో పరిమాణాన్ని రూ. 21,000 కోట్లకు తగ్గించిన తర్వాత కూడా దేశంలో ఇప్పటివరకూ ఇదే పెద్ద పబ్లిక్ ఆఫర్ అవుతుందన్నారు. మార్కెట్లో షేర్లకు ఉన్న డిమాండ్, మార్కెట్ పరిస్థితులు స్థిరపడటం, ఒడిదుడుకులు తగ్గడం, దేశీ పెట్టుబడులు, కార్పొరేషన్ ఆర్థిక పనితీరు తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఐపీవోకు రావాలని నిర్ణయించామని దీపం కార్యదర్శి వివరించారు.
ఎల్ఐసీ నుంచి ఎఫ్పీవో ఏడాదిపాటు ఉండదని పాండే స్పష్టం చేశారు. సెబీ నిబంధనల ప్రకారం ఏ కంపెనీ అయినా కనీసం 5 శాతం వాటాను పబ్లిక్ ఇష్యూలో విక్రయించాల్సి ఉండగా, ప్రభుత్వం ఎల్ఐసీలో 3.5 శాతం వాటానే ఐపీవోలో జారీచేస్తున్న నేపథ్యంలో పాండే ఈ వివరణ ఇచ్చారు.
ఎల్ఐసీ ఐపీవో విషయంలో సెబీ సడలింపు ఇవ్వడంతో 3.5 శాతం షేర్ల జారీ సాధ్యపడింది. మీడియా అడిగిన ఒక ప్రశ్నకు పాండే సమాధానమిస్తూ ఐడీబీఐ బ్యాంక్ నిర్వహణ నుంచి ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వం క్రమేపీ వైదొలుగుతాయని తెలిపారు.