హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఎనిమిదో తరగతి చదువుతున్న వైష్ణవి.. కరోనా ముందు వరకు బస్సులో చక్కగా స్కూలుకు వెళ్లివచ్చేది. కొవిడ్తో కొన్ని గ్రామాలకు బస్సులు నిలిచిపోయాయి. లాక్డౌన్ ముగిసిన తర్వాత కొన్ని ఊళ్లకు బస్సులు ఇంకా మొదలుకాలేదు. రంగారెడ్డి జిల్లా మాచారం మండలం చిదేడు గ్రామం అందులో ఒకటి. ఇదే గ్రామానికి చెందిన వైష్ణవి.. స్కూలుకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నది. దీంతో తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలంటూ వైష్ణవి.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఉత్తరం రాసింది. తన తండ్రి కరోనా తొలి దశలో గుండెపోటుతో చనిపోయారని, తల్లి చిన్న ఉద్యోగంతో తమను పోషిస్తున్నదని పేర్కొన్నది. చిదేడుకు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తిచేసింది. చిన్నారి లేఖపై జస్టిస్ రమణ స్పందించారు. చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలతో చిదేడుకు బస్సు సౌకర్యాన్ని తిరిగి ప్రారంభించారు.
సమస్యలు పరిష్కరిస్తారనే సీజేకు లేఖ
ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో రోజూ ప్రైవేటు వాహనాల్లో స్కూలుకు వెళ్ళేందుకు ఇబ్బందులు పడుతున్నాం. మా బాధలను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సార్కు లెటర్ ద్వారా తెలిపే ప్రయత్నం చేశాం. సార్ స్పందించి ఆర్టీసీ అధికారులకు చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
-పొట్లూరి వైష్ణవి, ప్రణీత్.. విద్యార్థులు.
వైష్ణవి రోల్మోడల్
వైష్ణవి తమ గ్రామానికి బస్సు సౌకర్యం అవసరం ఉన్న విషయాన్ని ధైర్యంగా వెలుగులోకి తీసుకువచ్చి స్ఫూర్తిని నింపింది. వైష్ణవిని ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలి. రాష్ట్రంలో దాదాపు 30 గ్రామాలకు బస్సు సర్వీసులను పునరుద్ధరించాం. పిల్లల విద్యాహక్కు ప్రాధాన్యం గుర్తించి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు బస్ కనెక్టివిటీ ఇస్తాం.
-వీసీ సజ్జనార్, ఎండీ, టీఎస్ ఆర్టీసీ
బస్సు సర్వీసుల కోసం..
ఫోన్ నంబర్లు:
040-30102829,
040-68153333. ట్విట్టర్: @tsrtcmdoffice