హైదరాబాద్ : ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల పాఠశాల విద్యార్థులకు
విద్యనందించే విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాబోధన జరిగేలా చర్యలు చేపట్టింది. అలాగే విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం సమకూర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల విద్యాశాఖ అధికారులు డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్టంలోని విద్యాసంస్థలు ప్రారంభం కాగా.. విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా నేపథ్యంలో హాస్టళ్లు, గురుకులాలను తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు తెరవొద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించలేదు. రాష్ట్రంలోని సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీల చదివే విద్యార్థులంతా ఇండ్లల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో పాఠ్యాంశాలు నష్టపోయే అవకాశం ఉండడంతో స్థానికంగా, దగ్గరలో ఉన్న స్కూళ్లలో ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే అవకాశం కల్పించారు. అయితే, ఈ విద్యార్థుల సంఖ్య 4లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులందరికీ కోడిగుడ్డు, అరటిపండుతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని సైతం అందించాలని అధికారులు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు.