న్యూఢిల్లీ, అక్టోబర్ 29: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించనంత వరకు ప్రభుత్వాలు, దళారులు రైతులను దోపిడీ చేస్తూనే ఉంటారని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లలో తీవ్రమైన అవినీతి రాజ్యమేలుతున్నదని విమర్శించారు. దళారులు, ప్రభుత్వం కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వాధికారులు కావాలనే నిరాకరిస్తున్నారని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకొంటున్నారని, దళారులు రైతులకు ఎంఎస్పీ కంటే చాలా తక్కువ మొత్తంలో డబ్బు చెల్లిస్తూ దోచుకొంటున్నారని పేర్కొన్నారు. దీనికి అడ్డుకట్ట పడాలంటే మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘యూపీలో రైతులకు పెట్టుబడి లేదు. ఎరువుల్లేవు. పంటకు మద్దతు ధర లేదు. ప్రభుత్వ విధానాలతో ఎంతో మంది వ్యవసాయానికి దూరం అవుతున్నారు. ఇది ఆహార భద్రతకు, దేశ భద్రతకు ముప్పు. సామాజిక అశాంతికి కారణం అవుతుంది’ అని అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఏడాది కాలంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.