ఖైరతాబాద్,నవంబర్ 30:తప్పుడు పత్రాలను సృష్టించి ఓ మహిళా న్యాయవాదికి చెందిన ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన టీడీపీ నేతను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలో నివాసముంటున్న బండి కనకదుర్గ న్యాయవాది. 2017లో 110 గజాల స్థలంలోని ఇంటిని కొనుగోలు చేసి, కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటున్నారు. కాగా, అదే ప్రాంతంలో నివాసముంటున్న టీడీపీ నాయకుడు రమేశ్ గైక్వాడ్ వారి ఇంటిపై కన్నేశాడు. తప్పుడు పత్రాలను సృష్టించి కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ తీసుకోవడంతో పాటు జీహెచ్ఎంసీలో ఎలాంటి ఆధారాలు చూపకుండానే ఇంటిని తనతో పాటు తన కొడుకు పేరుపై మార్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కనకదుర్గ జీహెచ్ఎంసీ అధికారులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేసింది. కాగా, గత కొన్ని రోజులుగా ఇంటిని ఖాళీ చేయాలంటూ కనకదుర్గను, అమె కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేయడంతో పాటు కిరాయికి ఉంటున్న వారిని కూడా బెదిరిస్తున్నాడు.
ఈ క్రమంలో ఈనెల 9న కనకదుర్గ ఇంటివద్దకు వచ్చిన రమేశ్ గైక్వాడ్, రాహుల్ గైక్వాడ్ బెదిరింపులకు దిగారు. ఇంటిని తనకు అప్పగించకపోతే నడిరోడ్డుపై నరికేస్తామంటూ హెచ్చరించారు. దీంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై ఐపీసీ 420, 406, 468, 471 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితుడు రమేశ్ గైక్వాడ్ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉండగా, టీడీపీ నేత రమేశ్ గైక్వాడ్పై గతంలో కూడా పంజాగుట్ట, ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో చీటింగ్ కేసులున్నాయని తెలిసింది. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యూసుఫ్గూడ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన డిపాజిట్ కోల్పోయాడు.