Lava Blaze 5G | ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ల బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ తొలి 5జీ స్మార్ట్ ఫోన్ను ఆవిష్కరించింది. `లావా బ్లేజ్ 5జీ` అనే పేరుతో వస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.10 వేల వరకు ఉండొచ్చు. దీపావళి నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభిస్తామని లావా ఇంటర్నేషనల్ సోమవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)-2022 సదస్సులో ప్రకటించింది.
`భారత్లోనే తయారైన 5జీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి మేం ఎల్లవేళలా ఆసక్తితో ఉన్నాం. భారతీయులకు చౌక ధరకే 5జీ టెక్నాలజీ అందుబాటులోకి తేవాలన్న విజన్తో మేం అభివృద్ధి చేసిన ఫోన్ ఇది` అని లావా ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ అండ్ ప్రెసిడెంట్ సునీల్ రైనా ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ను తదుపరి తరం టెక్నాలజీ పవర్గా నిలిపేందుకు, ప్రతి భారతీయ స్మార్ట్ ఫోన్ యూజర్ గర్వంగా ఫీలయ్యేలా `లావా బ్లేజ్ 5జీ` ను డెడికేట్ చేస్తున్నాం. ఈ ఫోన్ ఆవిష్కరణతో అందరికీ 5జీ టెక్నాలజీ పొందే సామర్థ్యం కల్పించడమే లక్ష్యం` అని రైనా పేర్కొన్నారు.
యూజర్ల సౌలభ్యం కోసం 50 మెగా పిక్సెల్ (ఎంపీ) ఏఐ ట్రిపుల్ రేర్ కెమెరా, సూపర్ ఫొటోగ్రఫీ ఎక్స్పీరియన్స్తోపాటు సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫీచర్ జత చేసింది లావా ఇంటర్నేషనల్. మీడియాటెక్ డైమెన్సిటీ 500 టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ ఫోన్.. హై ఎండ్ యూజర్లకు 4జీబీ +3జీబీ వర్చువల్ రామ్ అందుబాటులో ఉంటుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ దీని సొంతం. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ జత చేశారు.
వైడ్వైన్ ఎల్1 సపోర్ట్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తో 6.5 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఆల్ట్రా ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు జత చేశారు. `ఇండియన్ విజన్కు అనుగుణంగా, యూజర్లందరికీ టెక్నాలజీని అందుబాటులోకి తేవడమే లక్ష్యం` అని మీడియా టెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకుజైన్ తెలిపారు.