మహబూబ్నగర్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణే బియ్యం ఇస్తలేదని చెప్పిన గోయల్.. మరి ఇదేం గోల్మాల్? సమస్యేదైనా తర్వాత చూద్దాం అంటున్న ఓ కేంద్రమంత్రీ.. మరి ఇదేం నిర్వాకం? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో (వికారాబాద్ జిల్లా కలుపుకొని) కేంద్రం సేకరించాల్సిన బియ్యం 6,01,117 మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటిదాకా సేకరించింది 2,00,159 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇంకా 4,00,958 మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉన్నది. ఎఫ్సీఐ విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ ఏడాది మే నుంచి పాలమూరులో ఎఫ్సీఐ బియ్యం సేకరిస్తున్నది. ఎనిమిది నెలల్లో వారు చేరుకొన్న లక్ష్యం 33 శాతమే. సేకరించాల్సింది ఇంకా 67 శాతం ఉన్నది.
అంటే ఇంకా మిగిలి ఉన్న 24 రోజుల్లో 4,00,958 మెట్రిక్ టన్నులు సేకరిస్తారా? అంటే అంత సీన్ లేదనే చెప్పొచ్చు. బియ్యం సేకరణలో ఎందుకీ వెనుకబాటు అంటే.. కేంద్ర ప్రభుత్వం తీరే. ఉమ్మడి జిల్లా పరిధిలో 6 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం ఉన్నప్పుడు కనీసం 2 నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాములు ఉండాలనేది నిపుణులు చెప్పే మాట. కానీ ఇక్కడ ఉన్న గోదాముల సామర్థ్యం 70వేల మెట్రిక్ టన్నులే. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న సీడబ్ల్యూసీ గోదాములో ఎఫ్సీఐకి 20వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండేది. దాన్నిప్పుడు సగానికి తగ్గించారు. అంటే.. బియ్యం సేకరణను అపహాస్యం చేస్తున్నట్టేగా. మిల్లర్ల వారీగా స్టాక్తోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఓ మిల్లర్కు సంబంధించిన లాట్ సదరు మిల్లర్ మాత్రమే భర్తీ చేయాలని ఎఫ్సీఐ నిబంధన విధిస్తున్నది. సదరు మిల్లర్ సకాలంలో స్టాక్ అందించకపోతే ఆ స్థానంలో వేరే మిల్లర్ స్టాక్ ఇచ్చేందుకు ఒప్పుకోవటం లేదు. దానివల్ల ఖాళీ ఉన్నా అక్కడ బియ్యం సేకరించని పరిస్థితి తలెత్తుతున్నది. ఇక ఏటా ప్రైవేటు గోదాములతో అగ్రిమెంట్ చేసుకొనే ఎఫ్సీఐ.. జెమ్ పోర్టల్ పేరిట కాంట్రాక్టులకు మూడు, నాలుగు నెలల సమయం తీసుకొంటున్నది. దీంతో గోదాముల అగ్రిమెంట్ కూడా ఆలస్యం అవుతున్నది.
వారానికి 2-3 వ్యాగన్లే..
మహబూబ్నగర్ స్టాక్ పాయింట్ నుంచి బియ్యం తరలించేందుకు వారానికి 4 నుంచి 6 వ్యాగన్లు రావాల్సి ఉండగా ప్రస్తుతం కిందామీదపడి వారానికి 2 నుంచి 3 వ్యాగన్లు మాత్రమే పంపిస్తున్నారు. 6 వ్యాగన్లు వస్తే 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించేందుకు అవకాశం ఉండేది. 2 లేదా 3 వ్యాగన్లే రావటంతో 7 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే తరలించేందుకు అవకాశం ఏర్పడుతున్నది. ఇలా తెలంగాణకు కేంద్రం, ఎఫ్సీఐ కండ్లముందే అన్యాయం చేస్తున్నాయి. పార్లమెంటులో మాత్రం తెలంగాణ రాష్ట్రమే బియ్యం ఇవ్వలేదంటూ పీయూష్ గోయల్ అబద్ధాలు మాట్లాడటం గమనార్హం. కేంద్రం మోసం చేస్తున్నదనటానికి, ఎఫ్సీఐ దగా చేస్తున్నదనటానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లెక్కలు చూస్తే సరి. తెలంగాణ నుంచి పద్ధతి ప్రకారంగా బియ్యం సేకరించాలనే ఆలోచనే కేంద్రానికి లేదని మిల్లర్లు చెప్తున్నారు. అందుకే ప్రతి దశలోనూ ఆలస్యం చేస్తూ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు.
మేం సిద్ధంగా ఉన్నాం
మహబూబ్నగర్ ఎఫ్సీఐ గోదాముల పరిధిలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ నుంచి బియ్యం సేకరించాల్సి ఉన్నది. అయితే మా పరిధిలో ఉన్న రెండు ఎఫ్సీఐ గోదాముల్లో 60 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యమే ఉన్నది. ఒక్క మహబూబ్నగర్ పరిధిలోనే 1,45,500 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాల్సి ఉన్నది. మొత్తం 5 జిల్లాల పరిధిలో చూసుకొంటే ఈ నిల్వ సామర్థ్యం ఏ మూలకూ సరిపోదు. వారానికి 4 నుంచి 6 వ్యాగన్లు రావాల్సి ఉన్నా, ప్రస్తుతం 2 నుంచి 3 వ్యాగన్లే వస్తున్నాయి. దీంతో గోదాముల నుంచి బియ్యం తరలించే ప్రక్రియ ఆలస్యం అవుతున్నది. మరోవైపు బాయిల్డ్ రైస్ సిద్ధం చేశాక సేకరణ ఆలస్యం చేస్తే పురుగు వస్తుంది. మళ్లీ ఎఫ్సీఐ రిజెక్ట్ చేసే ప్రమాదం ఉన్నది. అందుకే గోదాముల్లోని స్టాక్ వ్యాగన్ల ద్వారా తరలించినదాన్ని బట్టి మిల్లర్లు బియ్యం ఆడిస్తున్నారు. నిల్వ సామర్థ్యం ఎక్కువ చేసి, వ్యాగన్ల సంఖ్యను పెంచి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. ఎఫ్సీఐ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. అందుకే ఇప్పటికీ బియ్యం సేకరణ పూర్తికాలేదు. ఈ నెల చివరి నాటికి లక్ష్యం నెరవేరడం అసాధ్యం.
బియ్యం కొనరు..
రాష్ట్రమే ఇవ్వలేదని అభాండం వేస్తరు
గోదాంలు ఇవ్వరు..
మిల్లర్ కోటా అని తప్పించుకుంటరు
వ్యాగన్లు రావు..
తెలంగాణపై కక్ష కట్టారు కదా.. రానివ్వరు
కొర్రీలు పెడ్తరు..
బియ్యం తీసుకోవాలన్న ఆలోచన ఉంటే కదా మొత్తంగా రైతును మోసం చేస్తరు..
రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతరు..
ఎఫ్సీఐది దగా.. కేంద్రానిది మోసం!!