కవాడిగూడ:తెలుగు బాషను పరిరక్షించుకునేందుకు బాషా ప్రేమికులు, సాహితీవేత్తలు ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు బాష చట్టాలను పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు ప్రజా ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం తెలుగు కూటమి, తెలుగు బాషా చైతన్య సమితి, తెలంగాణ రచయితల సంఘం, లక్ష్యసాధన ఫౌండేషన్, సత్యాన్వేషణ మండలి, గోల్కొండ సాహితి, సృజన సాహితిల సంయుక్త ఆధ్వర్యంలో దోమలగూడలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్లో తెలుగు బాషా చైతన్య సమితి అధ్యక్షుడు బడేసాబ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలుగు బాషను పరిరక్షించుకుంటేనే మన అస్థిత్వాన్ని కాపాడుకున్నట్లు అవుతుందని అన్నారు.
తెలుగు మాధ్యమంలో బోధనలను కొనసాగించాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. ఉద్యోగాలలో తెలుగు మాధ్యమంలో చదివిన వారికి 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. తెలుగు బాష పరిరక్షణకోసం సెప్టెంబర్ 5న అన్ని తెలుగు సంఘాల ప్రతినిధులు, సాహితీవేత్తలతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. అదే విధంగా ఈ నెల 29న ఇందిరాపార్కులో ప్రముఖ సాహితీవేత్త గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఉదయం 8 గంటలకు నడక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం, మహిళా భారతి అధ్యక్షురాలు డాక్టర్ దాసోజు పద్మావతి, తెలుగు కూటమి అధ్యక్షుడు పారుపల్లి కోదండరామయ్య, లక్ష్యసాధన ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రజ్ఞారాజు, తెలుగు సాహిత్య వైభవం అధ్యక్షుడు మేక రవీంద్ర, సృజన సాహితీ నల్లగొండ ఉపాధ్యక్షుడు డాక్టర్ మండల స్వామి, గోల్కొండ సాహితీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.