వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ను సక్రమంగా సరఫరా చేయడం లేదంటూ సూర్యాపేట జిల్లా మోతే మండలం లాల్తండా సబ్స్టేషన్ పరిధిలోని రైతులు ఆందోళనకు దిగారు. లాల్తండా, బిక్య తండాలకు చెందిన రైతులు విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
రైతుల తెలిపిన వివరాల ప్రకారం.. సబ్స్టేషన్ పరిధిలో తరచూ బ్రేక్డౌన్లు ఏర్పడుతున్నాయి. దీంతో విద్యుత్ లైన్లను కట్ చేస్తున్న అధికారులు వాటిని తిరిగి కలపకుండా రోజుల తరబడి వదిలేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని లైన్ల విషయంలో నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు.
విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలకు నీరు అందించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్లో కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. అధికారులకు పలుమార్లు సమస్యను వివరించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
లాల్తండా సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్లను వెంటనే పరిశీలించి, బ్రేక్డౌన్ అయిన ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయానికి నిర్ణీత సమయాల్లో నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.