న్యూఢిల్లీ: అద్వితీయమైన ఆటతీరుతో చెలరేగుతున్న భారత యువ షట్లర్ లక్ష్యసేన్కు.. జర్మన్ ఓపెన్ సూపర్-300 ఫైనల్లో ఓటమి ఎదురైంది. సెమీస్లో ఒలింపిక్ చాంపియన్ అక్సెల్సెన్ను ఓడించిన లక్ష్యసేన్.. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 18-21, 15-21తో కున్లావత్ వితిద్సర్ణ్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్-500 టోర్నీ టైటిల్ నెగ్గిన 20 ఏండ్ల లక్ష్యసేన్ 57 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో పోరాడినా.. చివరి వరకు ఆధిక్యం నిలుపుకోలేకపోయాడు. సింధు, సైనా, శ్రీకాంత్లాంటి హేమాహేమీ ఆటగాళ్లు సెమీస్కు చేరకుండానే ఓటమి పాలైన ఈ టోర్నీలో లక్ష్యసేన్ చక్కటి పోరాట పటిమ కనబర్చాడు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్లో ప్రత్యర్థికి చుక్కలు చూపిన సేన్.. చివర్లో ఒత్తిడికి గురై పాయింట్లు కోల్పోయాడు. రెండో గేమ్లో కున్లావత్ విజృంభించగా.. లక్ష్య దీటైన బదులివ్వలేకపోయాడు.