హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టనున్న దీక్ష కోసం తమను తీసుకొచ్చి డబ్బులివ్వడం లేదని ఆరోపిస్తూ అడ్డా కూలీలు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన పీర్జాదిగూడలో చోటు చేసుకున్నది. మంగళవారం బోడుప్పల్లో ఎగ్జిబిషన్ మైదానంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీక్ష కోసం కెనరా నగర్ బస్టాండ్ వద్ద ఉన్న అడ్డా కూలీల వద్దకు ఆ పార్టీకి చెందిన రాఘవరెడ్డి వెళ్లి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కూర్చుంటే ఒక్కొక్కరికి రూ.400 చొప్పున ఇస్తామని చెప్పారు.
ఇందుకు వారు అంగీకరించడంతో 50 మందిని బస్సులో దీక్షాస్థలికి తరలించారు. అయితే, దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అందరినీ అక్కడి నుంచి వెళ్లగొట్టారు. తమకు కూలీ డబ్బులివ్వాలని మహిళలు పార్టీ కోరగా.. ఆ పార్టీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపిస్తూ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనను మీడియా కవర్ చేస్తుండడం గమనించిన నేతలు.. ఆ తర్వాత వచ్చి మహిళలను శాంతింపజేశారు.