ఢిల్లీ, మే 30: కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా మరణాల సంఖ్య పెరగడంతో తమ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి కార్మికుల్లో ఏర్పడిన భయాందోళలను తొలగించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రిత్వ శాఖ పలు చర్యలను తీసుకుంది. కార్మిక రాజ్యబీమా సంస్థ (ఇ.ఎస్.ఐ.సి.), ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ.)ల ద్వారా కార్మికులకు అదనపు ప్రయోజనాలను ప్రకటించింది. ఉద్యోగి, లేదా కార్మికుడికి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే మరింత విస్తృత స్థాయిలో సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలను ప్రకటించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఇ.ఎస్.ఐ.సి. కింద బీమా పొందిన వ్యక్తి తన విధి నిర్వహణలో గాయాలతో మరణించినా లేదా అంగవికలుడైనా, సదరు ఉద్యోగి సగటు దినసరి వేతనంలో 90శాతానికి సమానమైన పెన్షన్,. తన జీవిత భాగస్వామికి లేదా వితంతువైన తల్లికి జీవితాంతం అందుతుంది. పిల్లలకు అయితే వారు పా25ఏండ్ల వయస్సు వచ్చేవరకూ పెన్షన్ ఇస్తారు. అదే ఆడపిల్లకైతే తన వివాహం వరకూ ఈ సదుపాయం వర్తిస్తుంది.
ఇ.ఎస్.ఐ.సి. పథకం కింద బీమా సదుపాయం ఉన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఉద్యోగికి కోవిడ్ వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే ఇ.ఎస్.ఐ.సి. ఆన్ లైన్ పోర్టల్ లో పేర్లు నమోదైన ఉద్యోగి కుటుంబ సభ్యులందరికీ అవే ప్రయోజనాలను, అవే పద్ధతిలో వర్తింపజేయాలని కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అయితే, ఈ కింద సూచించిన అర్హతాపరమైన షరతులకు లోబడి ఈ ప్రయోజనాలను వర్తింపజేస్తారు.