‘మాకొద్దీ నల్ల దొరతనం’ అంటూ అంటరానితనంపై పోరు సలిపిన తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న. తన కలంతో, గళంతో ఏక కాలంలో అంటరానితనంపై పోరు సలిపిన కవి. సంఘ సంస్కరణ అభిలాష కలిగిన ఆయన అంబేద్కర్ నుంచి స్ఫూర్తి పొందారు. ‘మాకొద్దీ నల్ల దొరతనం’ అంటూ నినదించిన ఆయన జాతిని మేల్కొల్పే దిశగా ఎన్నో రచనలు చేశారు. నిమ్న జాతి ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం వంటివి ఆయన కలం నుంచి జాలువారినవే.
రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ-వీరస్వామి, దంపతులకు 1900 మార్చి 17న జన్మించాడు. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం కలిగిన వ్యక్తి. నిమ్న జాతి, ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం వంటి రచనలు చేశారు. చదువుకున్న రోజుల్లోనే సంఘసంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నుంచి స్ఫూర్తి పొంది, అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలితరం దళిత కవి ధర్మన్న.
రాజమహేంద్రవరం కార్యక్షేత్రంగా జాతీయోద్యమకాలంలో దళితుల కోసం పొలికేక వేసిన కుసుమ ధర్మన్న 1900లో పుట్టి 1945, ఏప్రిల్ 17న కన్ను మూశారు. అటు దేశానికీ, ఇటు దళిత జాతికి తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి. సాంఘిక, సాంస్కృతిక, సాహితీ రంగాల్లో ఆయన వేసిన ముద్ర అనితర సాధ్యమైంది. బహుముఖీనమైన ధర్మన్న ప్రతిభ ప్రధానంగా ఐదు మార్గాల్లో విస్తరించింది.
వైద్యరంగం, సాహిత్య సృజన, కళారంగం, పత్రిక నిర్వహణ, వాక్తృత్వం… ఈ పంచ గుణాలతో ధర్మన్న ఆనాటి సమాజాన్ని, ముఖ్యంగా దళిత జాతిని ఉత్తేజపరిచాడు. వైద్య విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడైనా ధర్మన్న తను నేర్చిన వైద్యాన్ని సమాజం కన్నెత్తి చూడ నిరాకరించిన గ్రామీణులకు పేద దళితులకు అందించిన ప్రజా వైద్యుడు. ఆధునిక ప్రజా వాగ్గేయకారుడు ధర్మన్న తొలి రోజుల్లో గాంధీ సిద్ధాంతాల వైపు చూసి దళిత విముక్తికి అంబేద్కరే శరణ్యమని నమ్మి ఆయన సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. జయభేరి పత్రికను స్థాపించిన తొలి దళిత పత్రిక సంపాదకుడు కుసుమ ధర్మన్న. 1925 నుంచి ఆంధ్ర దేశంలో అనేక ప్రాంతాల్లో జరిగిన అఖిలాంధ్ర మహాసభల్లో ధర్మన్న ఆలోచనాత్మకమైన, ఉద్వేగమైన ప్రసంగాలు ఎన్నో చేశాడు.
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో కవిగా, రచయితగా కుసుమ ధర్మన్న స్థానం ఆద్వితీయమైనది. దళిత పోరాట చరిత్రలోను ఆయనకు ఆయనే సాటి. అందుకే, వారి ఆశయాలను ఆలోచనలను, ఉద్యమ స్ఫూర్తిని, సామాజిక సేవను, సమతా వాదాన్ని, నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తను చేసినటువంటి రచనలు, సేవలు నేటికీ చిరస్థాయిగా నిలిచే ఉన్నాయి.
– దేవులపల్లి రమేశ్ 99637 01294