హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 23: రాష్ర్టవ్యాప్తంగా 2026 విద్యాసంవత్సరానికి బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్నట్లు టీజీ ఎడ్సెట్-2026 పూర్తి షెడ్యూల్ను కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విడుదల చేశారు. టీజీ ఎడ్సెట్- 2026 చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి సోమవారం విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో నిర్వహించిన సమావేశంలో షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు.
23 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
23వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.750 పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.550 చెల్లించి దరఖాస్తు నమోదు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 15వ తేదీ చివరి గడువుగా నిర్ణయించినట్లు, రూ.250 అపరాధ రుసుంతో ఏప్రిల్ 22 వరకు, మరోసారి రూ.250 అపరాధ రుసుంతో ఏప్రిల్ 27 వరకు, రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయన్నారు. మే 2వ తేదీ నుంచి దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని, మే 4వ తేదీన పరీక్షా కేంద్రాల కేటాయింపు జరుగుతుందన్నారు.
మే 15వ తేదీన ప్రాథమిక కీ విడుదల
రూ.5000 అపరాధ రుసుంతో మే 8 నుంచి 9 తేదీలలో ప్రత్యేక అవకాశాన్ని కల్పించనున్నట్లు, హాల్టికెట్లు మే 9వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ ప్రవేశ పరీక్ష మే 12వ తేదీన ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు రెండు సెషన్లలో నిర్వహించబడుతుందని వారు తెలిపారు. మే 15వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేయబడుతుందని, మే 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారన్నారు. తుది ఫలితాలు మే 30వ తేదీన ప్రకటించబడతాయని వారు చెప్పారు.
ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ ఎన్.రామనాధకిషన్, ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ ఎడ్సెట్-2026 అధికారిక వెబ్సైట్ను వారు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా టీజీ ఎడ్సెట్-2026 నిర్వహణకు 16 నగరాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు, హైదరాబాద్ను నాలుగు భాగాలుగా, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, సిద్దిపేట ఉన్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి తెలిపారు.