టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఘనంగా జరిగాయి. కేటీఆర్ పుట్టినరోజును ముక్కోటి వృక్షార్చన పేరుతో జరుపుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టంగా మంత్రి జగదీశ్రెడ్డి అభివర్ణించారు. అందులో బాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నకిరేకల్ నుండి తానాంచార్ల వరకు మొత్తం 80 కిలో మీటర్ల మేర 60 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావులతో కలసి మంత్రి ప్రారంభించారు.
అంతే గాకుండా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పేరుతో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతివనంలో 5 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మాణవెళ్లంల గ్రామంలో సుమారు 9 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తన సొంత నిధులతో 20 మంది వికలాంగులకు కొనుగోలు చేసిన ట్రై మోపెడ్ లతో పాటు సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి సొంతంగా కొనుగోలు చేసిన ట్రై మోపెడ్ లను దివ్యాంగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ జీడీ బిక్షం, ఎంపీపీ నెమ్మది బిక్షం తదితరులు పాల్గొన్నారు.