హైదరాబాద్ : హైదరాబాద్ నగరం గూగుల్కు గుండెకాయ, అమెజాన్కు ఆయువుపట్టులాంటిదని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో మంత్రి పాలన సంస్కరణలు, విద్యుత్, ఐటీ, పారిశ్రామికాభివృద్ధిపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా గతేడాదిన్నర క్రితం కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించిందని, ఈ సందర్భంగా ఏరకమైన కార్యక్రమాలు చేస్తే నవభారతాన్ని నిర్మించవచ్చో సూచనలు ఇవ్వండని వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని ప్రధాని ఆహ్వానించారన్నారు.
పార్టీ తరఫున కార్యనిర్వహక అధ్యక్షుడిగా తాను సమావేశానికి హాజరయ్యానని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ‘త్రీ ఐ’ మంత్రా నడుస్తుందని చెప్పినట్లు గుర్తు చేశారు. ‘త్రీ ఐ’ అంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూసివ్ గ్రోత్ అని, ఈ మూడింటిని దేశవ్యాప్తంగా అమలు చేయగలిగితే ఖచ్చితంగా నయా భారత్ను కొత్త తరానికి అందివచ్చని చెప్పినట్లు పేర్కొన్నారు.
గడిచిన ఏడు సంవత్సరాల్లో ఎన్నో రకాల పరిపాలన సంస్కరణలు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వం ఆవిష్కృతమయ్యాయన్నారు. పాలకుల, అధికారులతో చేతిలో దశాబ్దాలుగా బందీ అయిన అధికారాన్ని ప్రజల చేతికి అందించడం, సంక్షేమ అభివృద్ధి ఫలాలు నిరాటంకంగా పేదలు, బలహీన వర్గాలకు అందించడంతో పాటు వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించడమే సంస్కరణ ఉద్దేశమన్నారు. ఆ ఆశయంతో సీఎం సారథ్యంలో తెలంగాణలో చేపట్టిన సంస్కరణల పర్వంలో సువర్ణ అధ్యాయాలు ఎన్నో ఎన్నోన్నో ఉన్నాయన్నారు.
పరిపాలన సంస్కరణకు ప్రాణాధారం సరైన సమాచారం అని, ప్రజలకు సంబంధించిన సమాచారం లేనిదే ఏ ప్రభుత్వం కూడా ఏరకమైన కార్యాచరణను ప్రారంభించి విజయవంతం చేసే అవకాశం ఉండదని, అందుకే తెలంగాణ పరిపాలన పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ‘సమగ్ర కుటుంబ సర్వే’ యజ్ఞానికి శ్రీకారం చుట్టారన్నారు. ఒకే రోజులో భారతదేశం అబ్బురపడేలా తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రాన్ని గణాంకాలతో సహా సేకరించడంలో దేశ చరిత్రలో ఒక కొత్త సంచలనానికి, ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.
గతంలో దేశంలోని ఎంతో మంది ప్రముఖులను కలిసిన సందర్భంలో ఒక మాట అనేదని.. ‘వాట్ బెంగాల్ థింక్స్ టుడే.. ఇండియా విల్ థింక్స్ టుమారో’ (ఈ రోజు బెంగాల్ ఆలోచించేది.. రేపు దేశం ఆలోచిస్తుంది) అనేది అప్పటి నానుడి.. కానీ ఈ రోజు.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ‘వాట్ తెలంగాణ డజ్ టుడే.. ఇండియా డజ్ టుమారో’ (ఇవాళ తెలంగాణలో జరిగేది.. రేపు దేశవ్యాప్తంగా జరుగుతుంది) అనేలా.. సగర్వంగా విజయ ప్రస్థానం కొనసాగిస్తుందన్నారు. సంక్షేమ పథకాలే కాదు.. సంస్కరణ ఫలాలు తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఈ ఏడున్నరేళ్ల ప్రస్థానం.. సంస్కరణలకే స్వర్ణయుగం అన్నారు. కొత్త రాష్ట్రమే కాదు.. సరికొత్తగా పది జిల్లాలు ఉన్న తెలంగాణను అధికార వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలనే ఉద్దేశంతో 33 జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను పెంచినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదర్శ గ్రామం అంటే.. గంగదేవిపల్లె పేరు చెప్పేవారని.. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో పల్లె ప్రగతి కార్యక్రమంలో నిధులు, విధులతో ప్రతి పల్లె ఆదర్శ పల్లెగా కేంద్రప్రభుత్వం స్వయంగా గుర్తించి, అవార్డులు అందజేస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతిని కొత్త మున్సిపల్ చట్టంతో కడిగేసే బ్రహ్మాస్త్రంగా తీసుకువచ్చారన్నారు.
శాంతిభద్రలు పటిష్టంగా ఉంటానే రాష్ట్రం సురక్షితంగా ఉంటుందన్నారు. గతంలో రాష్ట్రంలో కేవలం పోలీస్ కమిషనరేట్లు ఉంటే.. ఇప్పుడు తొమ్మిది కమిషనరేట్లతో.. దేశంలోనే లా అండ్ ఆర్డర్లో తెలంగాణ ‘ఫస్ట్ ఇన్ సేఫ్టీ.. బెస్ట్ ఇన్ సెక్యూరిటీ’ అనే విధంగా గొప్ప పేరుతెచ్చుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం తలపెట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 95శాతం పూర్తయిందని, యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు.. ఇతర రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా దిక్సూచి అన్నారు. త్వరలోనే సమగ్ర భూ సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అక్షాంశాలు, రేఖాంశాలతో భూమి గుర్తించి, పాస్పుస్తకాలు అందజేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లునిరంతర విద్యుత్తో నిరంతర సంపద సృష్టి జరుగుతోందని, పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ వస్తే ఉద్యోగాలు రావన్నారని, ఉన్న పెట్టుబడులు పోతాయని వెక్కిరించారని.. టీఎస్ ఐపాస్తో తెలంగాణకు కంపెనీలు క్యూకట్టాయన్నారు. ఒకప్పుడు విమర్శించిన వారే.. ప్రశంసిస్తున్నారన్నారు. తయారీ పరిశ్రమలో తెలంగాణకు ఎదురులేదని, ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పారు. టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి రాజధానిగా మారామని, నాడు ఆగమైన తెలంగాణ నేడు దేశానికి ఆదర్శమైందన్నారు. ఉపాధి అవకాశాలకు తెలంగాణ అక్షయపాత్ర అయిందని, గతంలో ఐటీకి హైదరాబాద్ బ్యాక్ ఆఫీస్గా ఉండేదని, ఇవాళ హైదరాబాద్ బ్యాక్ బోన్ అయ్యిందన్నారు. గూగుల్కు గుండెకాయ.. అమెజాన్, ఆపిల్కు ఆయువుపట్టు హైదరాబాద్ అన్నారు. ఫేస్బుక్ ఫస్ట్ ఫేవరెట్ డెస్టినేషన్ హైదరాబాద్ అని కేటీఆర్ అన్నారు.