KTR | ఫార్ములా ఈ రేసును హైదరాబాద్కు తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి, హైదరాబాద్ మహానగరానికి పేరు తీసుకురావాలని ప్రయత్నించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేసులో ఏదో జరిగిపోయిందంటూ రేసును రద్దు చేసి తనపై కేసు పెట్టారని పేర్కొన్నారు. ఈ కేసును న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ రేసు కేసులో భాగంగా శుక్రవారం నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి, హైదరాబాద్ మహానగరానికి పేరు తెచ్చే ఒక మంచి కార్యక్రమం ఫార్ములా ఈ రేస్ని హైదరాబాద్కి తెస్తే అందులో ఏదో జరిగిపోయిందంటూ ఆ రేస్ను క్యాన్సిల్ చేసి నా మీద కేసు పెట్టారు. అని అన్నారు.
నిన్న కాక మొన్న మీరు చూశారు. తమిళనాడు సీఎం విజయ్ ఒక మోటార్ రేసింగ్ ఈవెంట్కి లండన్ దాకా పోయారని కేటీఆర్ గుర్తుచేశారు. అది మోటార్ రేసింగ్ స్పోర్ట్కి కానీ, దాని వల్ల వచ్చే ఇమేజ్ అని అన్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులేమో లండన్ దాకా పోయి అక్కడి నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు.. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అదే ప్రయత్నం మేం చేసి, హైదరాబాద్కు, తెలంగాణకు మంచి పేరు, పెట్టబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినందుకు ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఫర్వాలేదని.. తమకు న్యాయస్థానాల మీద అపారమైన విశ్వాసం ఉందని కేటీఆర్ తెలిపారు. అందుకే ఇవాళ రెండోసారి కోర్టుకు హాజరయ్యానని తెలిపారు. భవిష్యత్తులో కూడా కోర్టు ఎప్పుడు పిలిచినా మళ్లీ వస్తానని స్పష్టం చేశారు.