హైదరాబాద్, జనవరి 26 : ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు, వివిధ రంగాల ప్రముఖులతో కూడిన ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్తో సమావేశమైంది. సీసీఐ పునరుద్ధరణకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. సీసీఐ పునరుద్ధరణ కోసం ఉమ్యమ కార్యాచరణ చేపడతామని, సీసీఐ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిస్తామని ప్రతినిధి బృందం కేటీఆర్కు తెలిపింది. సీసీఐ పునరుద్ధరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీని నిలదీస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీసీఐ విషయంలో ఆదిలాబాద్ యువత ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని స్పష్టంచేశారు. సీసీఐని పునరుద్ధరించాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులను కలిశామని, అనేక దఫాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు స్పందనలేదని విమర్శించారు. సీసీఐని తెరిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు పునరుద్ఘాటించారు.
కొత్త కంపెనీ ఏర్పాటుచేస్తే ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇస్తామో, అవన్నీ సీసీఐ పునరుద్ధరణకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లును ప్రారంభించిన చరిత్ర, నిబద్ధత తమకు ఉన్నదని గుర్తుచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఉపాధి అవకాశాల కల్పనకోసం కృషిచేస్తున్నట్టు చెప్పారు. దీనికి భిన్నంగా కేంద్రం తెలంగాణతోపాటు దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అప్పనంగా అమ్మేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. సింగరేణిని కూడా క్రమంగా ప్రైవేటీకరించే ప్రయత్నాలకు తెరలేపిందని ఆరోపించారు. త్వరలోనే ఆదిలాబాద్కు ఐటీ టవర్ మంజూరుచేస్తామని మంత్రి కేటీఆర్ హామీఇచ్చారు. దీంతోపాటు టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.