హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాకు చెందిన చిన్నారి మేఘన(ఐదో తరగతి) అరటిపండుపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాన్ని గీసింది. దీంతో చిన్నారి తండ్రి మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ… ‘అన్నా నమస్కారం… నాతో పాటు మా పాప ఎంతో అభిమానించే నాయకుడు కేటీఆర్ చిత్రాన్ని అరటిపండుపై గీసి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నది. రామన్నపై ఆమెకు ఉన్న అభిమానం రోజురోజుకు పెరుగుతున్నది’ అని ట్వీట్ చేశారు. ‘కేటీఆర్ అంకుల్ మీ డ్రాయింగ్ నేను అరటిపండు మీద వేశా ఎలా ఉంది’ అని మేఘన అడిగిన వీడియోను పోస్ట్లో పెట్టారు. దీనిపై మంత్రి ‘చిన్నారి ప్రతిభను మెచ్చుకుంటూ (నవ్వుతున్న, నమస్కారం చేస్తున్న)’ ఎమోజీలను ట్వీట్ చేశారు.