రాజన్న సిరిసిల్ల, మార్చి 11(నమస్తే తెలంగాణ) : కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2013లో తన ఆహ్వానం మేరకు కేంద్ర టెక్స్టైల్ మినిస్టర్గా ఉన్న కావూరి సాంబశివరావు సిరిసిల్ల పర్యటనకు వచ్చారని, సిరిసిల్లలో పవర్లూం పరిశ్రమ విస్తరణకు సహకారం అందించారని గుర్తుచేశారు. సిరిసిల్లకు విచ్చేసిన కావూరితో ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మచ్చలేని నాయకుడు అని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కావూరి మరణం పట్ల బుధవారం తన సంతాపాన్ని ప్రకటించారు. కావూరి తన చిన్న మామయ్య అని, ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. రాజకీయాలు, వ్యాపారాల్లో మచ్చలేకుండా రాణించారని గుర్తుచేశారు. పారిశ్రామిక రంగం, మౌలిక వసతుల అభివృద్ధి విషయంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. కావూరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.