హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారు పార్టీ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యమివ్వాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు కోరారు. నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణభవన్లో రం గారెడ్డి, మేడ్చల్, ఖమ్మం జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ ద్వారానే ప్రభుత్వ పదవులు వచ్చాయనే విషయాన్ని గుర్తించుకోవాలని, ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ప్రజలకు సీఎం కేసీఆర్పై సానుకూల దృక్పథం ఉన్నదని, దానిని మరింత పెంచేలా పార్టీ నాయకులుగా మనమందరం వ్యవహరించాలని సూచించారు. వరంగల్లో జరిగే బహిరంగసభకు ప్రతి గ్రామం నుంచి ప్రజలు రావడానికి ఉత్సాహంగా ఉన్నారని, వారు అక్కడికి రావడానికి వారిని సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ నేతలతో సమావేశాలను తరుచుగా నిర్వహిస్తామన్నారు. దానిద్వారా పార్టీ స్థానిక నాయకులకు, రాష్ట్ర నాయకత్వానికి మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయని కేటీఆర్ అన్నారు. పార్టీని డీఎంకే తరహాలో తయారు చేయడానికి త్వరలో తమిళనాడులో పర్యటిస్తానని తెలిపారు. టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎంపీ రంజిత్రెడ్డి, ప్రభుత్వ విప్లు అరికెపూడి గాంధీ, రేగా కాంతారావు, భానుప్రసాద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.