హైదరాబాద్, జనవరి28 (నమస్తే తెలంగాణ)/అయిజ: గెజిట్ అమలులో భాగంగా ఇప్పటికే పలు ప్రాజెక్టులను సందర్శించిన కేఆర్ఎంబీ సబ్కమిటీ బృందం తాజాగా రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), సుంకేశుల ప్రాజెక్టును శుక్రవారం పరిశీలించింది. సుంకేశుల, ఆర్డీఎస్ ప్రధాన కాలువలతోపాటు, ఇతర కాంపోనెంట్లను సందర్శించింది. ఈ బృందంలో కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిైళ్లె, సబ్కమిటీ సభ్యుడు, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, వనపర్తి సీఈ, జూరాల ఎస్ఈలు తదితరులున్నారు. కాగా, ఆర్డీఎస్పై టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీ నిర్ణయించినట్టు సమాచారం. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు 15.90 టీఎంసీలు రావాల్సి ఉండగా.. ఏటా 5 టీఎంసీలకు మించని దుస్థితి నెలకొన్నది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేకమార్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖలు రాసింది. కాలువలను మరమ్మతు చేయించడంతో పాటు పర్యవేక్షించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్డీఎస్ కాలువలు, హెడ్వర్క్స్పై టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. తద్వారా ఏమేరకు నీరు వస్తున్నది అనే విషయం తెలుసుకోవచ్చని భావిస్తున్నట్టు సమాచారం.
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని రివర్వ్యాలీ, జలవిద్యుత్తు ప్రాజెక్టుల ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) 23వ సమావేశం వర్చువల్ విధానంలో శుక్రవారం జరిగింది. ఎజెండాలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుపైనా కమిటీ సభ్యులు చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాల గురించి రాష్ట్ర ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఈఏసీ సైంటిస్టులు యోగేంద్రపాల్సింగ్, మున్నా కుమార్ షా, భద్రాద్రి కొత్తగూడెం సీఈ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.