సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉస్మానియా దవాఖానలోనూ కొవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. మొన్నటి వరకు ఉస్మానియాలో కరోనా అనుమానితుల వార్డు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే సాధారణ చికిత్సల కోసం దవాఖానకు వచ్చిన రోగుల్లో ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలుంటే వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి కరోనా పరీక్షలు చేయించేవారు. పాజిటివ్ వచ్చిన వారిని గాంధీ దవాఖానకు తరలించేవారు. అయితే ఉస్మానియాలో చికిత్స పొందే రోగులకు పాజిటివ్ వస్తే వారిని ఇతర దవాఖానలకు తరలించడం వల్ల అటు రోగులకు, ఇటు వైద్య సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యేవి. దీనిని అధిగమించేందుకు ఉస్మానియాలో చికిత్స పొందే రోగులకు కరోనా చికిత్స కూడా అందించాలనే ఉద్దేశ్యంతో ఉస్మానియాలో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ తెలిపారు.
గాంధీపై తగ్గిన భారం..
ప్రస్తుతం గాంధీ దవాఖానకు వస్తున్న కరోనా కేసుల్లో 90శాతం కేసులు ఇతర దవాఖానకు సంబంధించినవే. వేర్వేరు అనారోగ్య కారణాల వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతూ కరోనాకు గురైన రోగులను గాంధీకి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఉస్మానియాలో చికిత్స పొందుతూ కరోనాకు గురైన రోగులను గాంధీకి తరలించేవారు. ప్రస్తుతం ఉస్మానియా కొవిడ్ కేర్సెంటర్ అందుబాటులోకి రావడంతో ఉస్మానియాకు చెందిన కరోనా రోగులకు అక్కడే చికిత్స అందిస్తుండడంతో గాంధీపై కొంత భారం తగ్గిందని వైద్యులు తెలిపారు
కింగ్కోఠిలో..
ఉస్మానియాలో స్థలాభావం కారణంగా కరోనా కేర్ సెంటర్ను కింగ్కోఠిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కింగ్కోఠిలో 100పడకలను ఉస్మానియా కొవిడ్ కేర్ సెంటర్కు కేటాయించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. కరోనా రోగులకు చికిత్స అందించడానికి షిప్టుకు 5మంది చొప్పున 15మంది వైద్యులతో ప్రత్యేక వైద్యబృందాన్ని ఉస్మానియా కొవిడ్ కేర్ సెంటర్కు కేటాయించామన్నారు. ప్రస్తుతం ఉస్మానియా కొవిడ్ కేర్ సెంటర్లో 18మంది రోగులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ కొవిడ్ కేర్ సెంటర్లో కేవలం ఉస్మానియాకు చెందిన రోగులను మాత్రమే చేర్చుకుంటున్నామన్నారు.