Hyderabad | సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మహానగర శివారులో మరో అందమైన పార్కు రూపుదిద్దుకోనున్నది. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఈ పార్కుకు రూపకల్పన చేస్తోంది. నగరవాసులకు పూర్తి స్థాయిలో ఆహ్లాదాన్ని పంచే పార్కుగా తీర్చిదిద్దనున్నారు. హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డును అనుకొని గచ్చిబౌలి-శంషాబాద్ మార్గంలో హిమాయత్సాగర్ జలాశయం పక్కన ఉన్న సుమారు 85 ఎకరాల స్థలం ఉంది.
ఔటర్ రింగు రోడ్డు ఇరువైపులా ఉన్న ఈ స్థలంలో 60 ఎకరాలు హిమాయత్సాగర్ వైపు, మరో వైపు రాజేంద్రనగర్ మానసహిల్స్ను అనుకొని 25 ఎకరాల స్థలం హెచ్ఎండీఏ పరిధిలో ఉంది. ఇందులో భాగంగా రిసార్ట్, ఫుడ్ కోర్టు, అడ్వెంచర్ జోన్లను ఏర్పాటు చేసేందుకు రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు కోరుతున్నది. ఈ మేరకు హెచ్ఎండీఏ అధికారులు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. బిడ్లను దాఖలు చేసేందుకు ఈ నెల 27 వరకు గడువు ఇచ్చారు. టెండరు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థల నుంచి టెక్నికల్ బిడ్ను పరిశీలించనున్నారు. మరోవైపు క్షేత్ర స్థాయిలో భూములను చదును చేసి రోడ్డు వేసే పనులు నిర్వహిస్తున్నారు.
85 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే పార్కుకు అద్భుతమైన ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేసి, లోపల పచ్చదనం పరవళ్లు తొక్కే లా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటిదిగా చెప్పుకునే రకరకాల పక్షులు నివాసం ఉండేందుకు వీలుగా ఏవియరీని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏర్పాటైతే ఒకే ప్రాంతంలో రకరకాల పక్షులను చూసేందుకు నగర వాసులకు అవకాశం కలగనున్నది.
☛ ల్యాండ్స్కేపింగ్
☛ ఏవియరీ – లార్జెస్ట్ ఆఫ్ ది కంట్రీ
☛ వ్యూ పాయింట్స్
☛ 2.50 కి.మీ దూరంతో కూడినబోర్డు వాక్ ప్రాంతం
☛ అడ్వెంచర్ జోన్
☛ ఆక్వా మైరీన్ పార్కు
☛ ఔటర్ రింగు రోడ్డు మీదుగా ఒక వైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు సస్పెన్షన్ బ్రిడ్జి
☛ లగ్జరీ రిసార్టుతో పాటు మినీ కన్వెన్షన్ సెంటర్
☛ ఇన్ఫినిటీ పూల్
☛ ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు