అబిడ్స్, జనవరి 6 : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)ను మూసి వేయాలని నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఎగ్జిబిషన్ను మూసివేస్తున్నట్లు మైదానంలో మైకుల ద్వారా ప్రకటించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నుమాయిష్ ఉండదు. 2020లో కరోనా నేపథ్యంలో ఎగ్జిబిషన్ నిర్వాహణకు అనుమతి లభించలేదు. దీంతో గత సంవత్సరం నుమాయిష్ను నిర్వహించ లేకపోయారు. కాగా ఈ సంవత్సరం అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులు లభించడంతో జనవరి 1న 1500 స్టాల్లతో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు.
ఇదిలా ఉండగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పబ్లిక్ సమావేశాలు, జనం గుంపులుగా ఉండడం, ర్యాలీలను నిషేధిస్తూ జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ఎగ్జిబిషన్ ప్రారంభమైన రెండో రోజే పోలీసులు ఎగ్జిబిషన్ నిర్వహించరాదని ఆదేశించడంతో సొసైటీ ప్రతినిధులు ఈ నెల 10 వరకు వాయిదా వేశారు. అయితే అంతలోపే నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కరోనా, ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎగ్జిబిషన్ను ముందు జాగ్రత్త చర్యగా తక్షణమే నిలిపివేయాలని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రభాశంకర్, కార్యదర్శి ఆదిత్యమార్గంలకు నోటీసులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు ఎగ్జిబిషన్ను నిలిపి వేస్తున్నట్లు మైకుల ద్వారా ప్రచారం చేశారు.