న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ మరో టోర్నీకి సిద్ధమవుతున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల్యూఎఫ్ కొరియా ఓపెన్ సూపర్-500 టోర్నీలో వీరితో పాటు యువ షట్లర్లు కుదరవల్లి శ్రీకృష్ణప్రియ, మాళవిక బన్సోద్, హెచ్ ఎస్ ప్రణయ్, సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప, సుమీత్ రెడ్డి, అర్జున్, ధ్రువ్ బరిలోకి దిగనున్నారు. జర్మన్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ ఫైనల్స్ ఆడిన లక్ష్యసేన్.. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 25వ ర్యాంకర్లు గ్వాంగ్ జు (చైనా)తో తలపడనున్నాడు. టోర్నీలో ముందుకు సాగుతున్నా కొద్ది టాప్ సీడ్ ఆంటోనీ గింటింగ్, జొనాథన్ క్రిస్టీ, లోహ్ కీన్ యే, లీ జీ జియా, కున్లావత్ వితిదసర్ణ్ వంటి వారితో లక్ష్యసేన్ తలపడాల్సి రానుంది. ఈ సీజన్లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీతో పాటు స్విస్ ఓపెన్లో విజేతగా నిలిచిన సింధు.. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో లౌరెన్ లామ్తో అమీతుమీ తేల్చుకోనుంది.