కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతటా ఎన్నికల వేడి పతాకస్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ప్రచార పర్వంతో హోరెత్తిస్తుండగా కోల్కతాలో ప్రముఖ స్వీట్ దుకాణం ‘బలరామ్ మల్లిక్ రాధారమణ్ మల్లిక్’ వినూత్న రీతిలో బెంగాలీ స్వీట్ సందేశ్ను సిద్ధం చేసింది. ఈ స్వీట్పై రాజకీయ పార్టీల చిహ్నాలను ముద్రించింది. కొన్నింటిపై తృణమూల్, బీజేపీ ఎన్నికల గుర్తులను ఉంచగా, మరికొన్ని స్వీట్లపై మమతా బెనర్జీ, నరేంద్ర మోదీ చిత్రాలు దర్శనమిచ్చాయి. మరికొన్ని స్వీట్లపై ఖేలా హొబ్, జైశ్రీరాం అని బెంగాలీలో ముద్రించారు.
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం తాము థీమటిక్ స్వీట్లను తయారుచేస్తుంటామని..క్రికెట్, ఫుట్బాల్ వరల్డ్ కప్స్ సందర్భాల్లోనూ ఇలాంటివి తయారుచేశామని స్వీట్ షాప్ అధినేత సుదిప్ మల్లిక్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగగా భావించే ఎన్నికలను హైలైట్ చేసే ఉద్దేశంతో ఈ స్వీట్లను తయారుచేశామని చెప్పుకొచ్చారు. ఎన్నికల థీమ్తో తయారైన స్వీట్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఇక మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 29న తుది దశ పోలింగ్ జరగనుండగా మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.