తిరుమల : తిరుమల ( Tirumala) శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam ) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈనెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు (TTD Chairman), ఈవో జె శ్యామలరావు ఆలయంలో జరిగిన సంప్రోక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది (Ugadi) , ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi ) పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి, నీటితో శుభ్రంగా కడుగుతారని వివరించారు.
స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి , శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సాంబశివరావు, రాజశేఖర్ గౌడ్, సుచిత్ర యెల్లా, పనబాక లక్ష్మి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్వో శ్రీధర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు,తదితరులు పాల్గొన్నారు.