తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ( Ugadi ) ఆస్థానాం సందర్భంగా మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసిందన్నారు. 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వెల్లడించారు. అదేవిధంగా మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని వివరించారు. ఈ కారణంగా మార్చి 18న విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడడవని వివరించారు.