ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నది. పట్టణ ప్రజలకు దీటుగా గ్రామీణవాసులకు సైతం నాణ్యమైన వైద్యం అందించే దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే అన్ని హంగులతో, అత్యాధునిక పరికరాలతో డయాగ్నస్టిక్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 సీహెచ్సీలను సూపర్ స్పెషాలిటీ దవాఖానలుగా పునరుద్ధరిస్తున్నది. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ సీహెచ్సీని వైద్య విధాన పరిషత్కు అనుసంధానం చేయగా.. ‘సూపర్ స్పెషాలిటీ’ సేవలను త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
కొడంగల్, నవంబర్ 23 : ప్రజారోగ్యమే పరమావధిగా సర్కార్ వైద్య రంగంలో వినూత్న మార్పులను తీసుకొస్తున్నది. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అన్నింటా మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రైవేట్ ఆస్పత్రుల తరహాల్లో ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్దుతూ.. సామాన్యులకు సౌకర్యవంతంగా వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ మధ్య కాలంలో అన్ని హంగులతో కూడిన వినూత్నమైన అత్యాధునిక పరికరాలతో డయాగ్నస్టిక్, డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో పేదలు వేలకు వేలుకు ఖర్చు చేసుకోలేక పోతున్నారనే అంశాన్ని గుర్తించిన ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో అధునాతన డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉచిత పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమయ్యే మందులు తక్కువ కాలంలో సరఫరా చేసేలా దేశంలో ఎక్కడా లేనివిధంగా డ్రోన్ ద్వారా వైద్యశాలలకు మందులను చేరవేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్ల పుడితే రూ.13వేలు, పిల్లవాడు పుడితే రూ.12వేలు అందిస్తూ చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు పాటుపడుతున్నది. చిన్నారులకు అవసరమయ్యే నాణ్యమైన పరికరాలతో కూడిన కేసీఆర్ కిట్ను అందిస్తున్నది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీహెచ్సీ ఆస్పత్రులతో గ్రామీణ ప్రాంత వాసులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు వినియోగించుకునే సదుపాయాలు అందుబాటులో లేని కారణంగా సీహెచ్సీలను అప్గ్రేడ్ చేస్తున్నది. రాష్ట్రంలోని 13 సీహెచ్సీలలో వికారాబాద్ జిల్లాలో కొడంగల్ సీహెచ్సీని వైద్య విధాన పరిషత్కు అనుసంధానం చేశారు. వారం రోజుల క్రితం ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో డీఎంఅండ్ హెచ్వో ఆధీనంలో ఉన్న కొడంగల్ సీహెచ్సీని అధికారికంగా వైద్య విధాన పరిషత్లో విలీనం చేశారు.
సూపర్ స్పెషాలిటీ దవాఖానగా కొడంగల్ సీహెచ్సీ
ప్రస్తుతం కొడంగల్ సీహెచ్సీ ఆస్పత్రిలో వైద్య సేవలు కొనసాగుతున్నప్పటికీ నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కొడంగల్ దవాఖానను సీహెచ్సీ నుంచి వైద్యవిధాన పరిషత్కు అప్పగించింది. గతంలో 30 పడకలుగా ఉన్న కొడంగల్ ఆస్పత్రిని 50 పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేసి అన్నింటా వైద్య సదుపాయాలకు అనువుగా ఉండేలా రూ.3కోట్ల25 లక్షలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. సంబంధిత అధికారులు భవనాన్ని పరిశీలించి మరిన్ని అవసరాల ఏర్పాటు నిమిత్తం చర్యలు తీసుకోనున్నారు.
కొడంగల్ సీహెచ్సీలో ఇద్దరు వైద్యులతో రోగులకు చికిత్సను అందిస్తున్నారు. ప్రతి రోజూ 100 నుంచి 110 వరకు రోగులు పరీక్షల కోసం వస్తున్నారని, కొవిడ్కు ముందు 150 మందికి పైగా రోగులు దవాఖానకు వచ్చేవారని వైద్యులు తెలిపారు. సిబ్బంది తక్కువగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులను తాండూరు, హైదరాబాద్ దవాఖానలకు తరలిస్తున్నారు. ఏదేని యాక్సిడెంట్ జరిగినా ఇక్కడ కొంతమేరకు చికిత్సను అందించి, అధికంగా గాయాలు, సీరియస్గా ఉన్నవారిని తాండూరు జిల్లా దవాఖానకు రిఫర్ చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలకు పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తున్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యవిధాన పరిషత్లో ఆస్పత్రి కొనసాగితే మెరుగైన వైద్య సేవలు అందుకునే సదుపాయం ఏర్పడుతుందని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.